చదువుకోడం ఎట్లా? 5.

( ‘ విజయం సాధించాలనే తపన నాలో బలం గా ఉంటే , అపజయం నన్ను ఎప్పుడూ ఓడించ లేదు ! ‘ )
స్వీయ విమర్శ ,నిర్మాణాత్మకం గా ఉండాలి ! : క్రితం టపాలో మనం తెలుసుకున్నాం , విద్యార్ధి ఎప్పుడూ , తన చదువు విషయం లో ఆశావహ దృక్పధం తో ఎందుకు ఉండాలో ! తెలియని సంగతులు తెలుసుకోవడం తప్పు కాదు ! పాఠాలు త్వరగా గ్రహించ లేక పోవడమూ తప్పు కాదు ! కానీ , చదివిన విషయాలు అర్ధం కావడం లో జాప్యం జరుగుతూ ఉంటే , అందుకు తమను తాము నిందించు కోవడమూ , ‘తమకు ఎప్పుడూ చదువు అబ్బదు ‘ అనే నిరుత్సాహ పూరితమైన ‘ ముద్ర ‘ వేసుకోవడం తప్పు ! మనకు మన మా తృ భాష లో( ఆ మాటకొస్తే , ఏ భాష లోనైనా ) ఒక వాక్యం రాయాలంటే , ముందు గా చేయవలసినది , ఆ భాష లో ఉన్న అక్షరాలను తెలుసుకోవాలి ! ఆ తరువాత , ఆ అక్షరాలతో , పదాలు రాయడం నేర్చు కోవాలి ! ఆ తరువాత , ఆ పదాలతో వాక్యాలు రాయడం నేర్చుకోవాలి ! ఇట్లా, ప్రతి సబ్జెక్ట్ లోనూ , ఆ సబ్జెక్ట్ కు చెందిన భాష ఉంటుంది ! అది, అక్షరాలకు బదులు గా పదాలు , అంటే, సాంకేతిక పదాలు గా ఉంటుంది ! ఆ పదాలను తెలుసుకోకుండా , ఆ సబ్జెక్ట్ ను పూర్తి గా అర్ధం చేసుకోవడం కష్టమే మరి ! పైన ఉన్న ఉదాహరణలు ఎందుకు రాయడం జరుగుతుందంటే , నేర్చుకోవడం అనేది, అనేక దశలు గా జరుగుతుంది ! ప్రతి దశా అతి ముఖ్యమైనదే ! విద్యార్ధులు , కేవలం వారిని వారు నిందించు కోకుండా , ఏ దశ లో పొరపాట్లు జరుగుతున్నాయో గ్రహించాలి ! అంతే కానీ, వారు ‘ నాకు ఇక చదువు రాదు ‘ అనే విపరీతమైన నిరాశా ఫలితాలు, వ్యాఖ్యానాలూ , ఆపాదించుకో కూడదు !
లోపాలు, పొరపాట్లు , శాశ్వతం కాదు ! : చాలా మంది విద్యార్ధుల లో తరచూ కలిగే ఇంకో సాధారణ అభిప్రాయం : కొన్ని వారాల లో పరీక్ష ఉంటే ‘ నా పరిస్థితి అధ్వాన్నం గా ఉంది ఇప్పుడు , నాకు చదవడానికి టైం లేదు ఇప్పుడు , పరీక్షలు దగ్గర పడుతున్నాయి, నేను అందుకోలేను , పరీక్ష సరిగా రాయ లేను ‘ అని , పూర్తి గా నిరాశా దృక్పధం తో , మిగతా సమయాన్ని కూడా , చదవ కుండా , దుర్వినియోగం చేస్తారు ! ఈ మానసిక పరిస్థితి నుంచి జరిగి, ‘ నేను కాస్త ఆలస్యం గా మొదలు పెడుతున్నాను , పరీక్షలకు చదవడం , అందువల్ల నేను ఇంకా జాగ్రత్త గా చదువుకోవాలి , నాకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ‘ అనే ఆశావహ దృక్పధం తో ఇంకొద్దిగా శ్రమ పడడానికి పూనుకోవాలి ! ఒక వేళ , బాగా శ్రమ పడ్డా , పరీక్ష లో ఫలితాలు సరిగా రాక పొతే ‘ నేను ఎప్పుడూ ఇంతే ! పరీక్ష లు చెడ గొడతాను ‘ అనే శాశ్వత నిరాశా ఫలితాల ముద్ర తమంత తామే వేసుకోకూడదు ! నింపాది గా, జరిగిన సంఘటనను విశ్లేషించుకుని , అవసరమైతే , తల్లి దండ్రులతో నో , లేదా ఉపాధ్యాయులతోనో , చర్చించి , ‘ ఆ లోపాలు ఉండడం వల్ల , నేను అనుకున్నంత బాగా చేయలేక పోయాను పరీక్షలో ‘ ఆ లోపాలు సరి దిద్దుకోవడం , నా చేతుల్లోనే ఉంది, ఈ సారి ఇంకా ఎక్కువ దీక్షతో ప్రయత్నిస్తాను’ ! అని ప్రతిజ్ఞ పట్టాలి ! విద్యా సరస్వతి, చేరదీసి, ఆదరించిన వారెవరి దగ్గరకైనా వస్తుంది ! ధనికులూ , పేదలూ అనే తారతమ్యం లేదు ఆమెకు ! ‘ నేను ఎప్పుడూ ఇంతే , సరిగా చదవను ‘ అని, తమకు తామే తీర్పు ఇచ్చుకున్న వారు కేవలం, ఆ సరస్వతీ దేవిని ‘ నా దగ్గరకు రావద్దు తల్లీ ‘ అంటున్నట్టే కదా !
పోలికలు, ఆరోగ్యకరం , ప్రమాద కరం కూడా ! : చదువు కు పోటీ ఉండడం మంచిదే , అది ఒక ఆరోగ్య కరమైన పరిస్థితి ! పోటీ ఉంటే , చదువు కోవాలనీ , బాగా చదువుకోవాలనీ , ఉత్తేజం కలుగుతుంది ! మిగతా పరిస్థితులన్నీ , సమానం గా లేక పోయినా , చిన్న వయసులో , తన ఈడు వారు చదువు కుంటూ ఉంటే , ఎట్లాగైనా తామూ చదువుకుని , వృద్ధి లోకి రావాలనే తాపత్రయం , పట్టుదలా వస్తాయి , పెరుగుతాయి కూడా ! కానీ, ఈ పోటీ ఎప్పుడూ , ఇంకా ,ఇంకా పట్టు దలతో , చదువు కోవాలనే దీక్ష ను శక్తి వంతం చేయాలి. ఉత్సాహాన్ని నీరు కారుస్తూ , నిరాశా దృక్పధం లోకి నెడుతూ , ఆత్మ న్యూనతా భావాన్ని కలుగ చేయకూడదు ! అంటే, పోటీ, విద్యార్ధులలో, పట్టుదలను పెంచేది గా ఉండాలి కానీ చదువు మీద తమ ‘ పట్టు ‘ సడలించి , పలాయనం చిత్తగింప చేసేది గా ఉండ కూడదు ! అందుకే , ఎక్కువ శ్రమ పడి చదువు తున్నప్పుడు , ఇతర విద్యార్ధులతో , పోల్చు కోకూడదు ! తమ ఏకాగ్రత అంతా, చదువు మీదా వచ్చే పరీక్ష మీదా మాత్రమే కేంద్రీకరించాలి !
‘ నా శక్తులన్నీ ఉపయోగించి , వీలైనంత బాగా చేస్తాను నేను , చదువు లోనూ , పరీక్ష లోనూ ‘ అనే కృత నిశ్చయమే ఎప్పుడూ విద్యార్ధి మనసులో ఉండాలి , ఒక మంత్రం లా ! ఆ మంత్రం , ఎంతో శక్తి వంతం గా వారికి మేలు చేస్తుంది ! వారి జీవితాంతం !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !