నీరు, మానవుల ప్రాధమిక హక్కు కాదంటున్న నెస్లే అధినేత !
నెస్లే ! ప్రపంచం లోని అతి పెద్ద కంపెనీలలో ఒకటి ! అతి ఎక్కువ లాభాల బాట లో ఉన్న కంపెనీలలో కూడా ఒకటి ! ఆ కంపెనీలో, ప్రపంచ వ్యాప్తం గా కనీసం లక్షన్నర మంది ఉద్యోగులు పని చేస్తున్నారు ! తల్లి ( పోత ) పాల పొడి డబ్బాలూ , చాక్లెట్లూ ( కిట్ క్యాట్ చాక్లెట్ , ఉదాహరణకు ) , పలహార సీరియల్స్ , అంటే బ్రేక్ ఫాస్ట్ సీరియల్స్ , కాఫీ ( ఉదా: నెస్కెఫె ) , ఇట్లా చెప్పుకుంటూ పొతే, అనేక ఉత్పత్తులు ! అతి ముఖ్యంగా , ప్రపంచం లో నీటిని సీసాలలో నింపి అమ్మే, అతి పెద్ద కంపెనీ ! నెస్లే కంపెనీ గురించి తెలియని వారికి , ఈ పరిచయం చాలేమో ! ఇటీవల నెస్లే కంపెనీ అధినేత ఒక ఉపన్యాసం ఇచ్చాడు. అందులో , తన కంపెనీ ఎంత పెద్దదో, ఎంత గొప్పదో కూడా వివరించాడు. అంతే కాకుండా , మానవులందరూ తాగే నీరు ను ప్రపంచం లో ఉన్న అతి ముఖ్యమైన వ్యాపార ముడి సరుకు అన్నాడు ! తాగు నీటిని ప్రైవేటీకరణ చేస్తే , నీటిని సరిగా అందరికీ అందేట్టు చేయవచ్చు ” అని అన్నాడు ! అంతే కాక , తాగు నీరు ప్రతి మానవుడి ప్రాధమిక హక్కు అంటున్నది ,కేవలం తీవ్రవాద భావాలున్న ప్రభుత్వేతర సంస్థలే ! అని కూడా చెప్పాడు !
ఆయన గారి ప్రసంగం లింకు వీడియో క్రింద నొక్కి వినండి / చూడండి !
ఆయన గారి దృష్టి లో నీరు కేవలం ఒక వ్యాపార వస్తువు ! అంతే కాక , ప్రపంచం లోని అతి పెద్ద కంపెనీలలో ఒకటైన నెస్లే కంపెనీ అధిపతి గా తాను , తన ఉద్యోగుల శ్రేయస్సు కోరుతూ, ఈ మాట చెబుతున్నాననీ , అది తన బాధ్యత అని కూడా చెప్పాడు ! దీనిలో అంతర్యం ఏమిటంటే , ఇంకా , ఇంకా వీలైనన్ని లాభాలు, నీటిని అమ్మి కూడా, నెస్లే కంపెనీకి కలిగించి , తద్వారా తన ఉద్యోగులకు , ఉద్యోగ భద్రత కలిగించడమే ! ఈ నీటిని ప్రైవేటీకరించడం అనే విషయం లో విపరీతం గా నష్టపోయేది , మారు మూల గ్రామాలలోనూ , నగరాలలో మురికి వాడలలోనూ నివశిస్తూ , కేవలం సరిఅయిన తాగు నీటి వసతి కూడా లేని లక్షలాది పేద ప్రజలే ! ఇటీవల దక్షిణ ఆఫ్రికా లో తీవ్రమైన ప్రజా ప్రతిఘటన ఉన్నా కూడా, నీటిని ప్రైవేటీకరించడం వల్ల , తాగే నీటిని కొనుక్కోలేక , కలుషిత నీటిని తాగి, కనీసం రెండు వందల మంది పేద ప్రజలు కలరా తో మరణించారు ! ఐక్య రాజ్య సమితి కూడా , జీవించే హక్కు తో పాటుగా , నీరూ , ఆహారం , బట్టా , ప్రతి మానవుడి ప్రాధమిక హక్కు అని తీర్మానించింది కూడా ! కానీ ఇట్లా ప్రపంచం లోని బడా కంపెనీ లు నీటిని ఒక వ్యాపార వస్తువు గా మార్చి సొమ్ము చేసుకుంటున్నాయి ! ఇప్పటికే భారత దేశం లో కూడా ,నీళ్ళ ట్యాంకు వాడి దగ్గర నుంచి , నీళ్ళ బాటిల్స్ సరఫరా చేసే వాడి వరకూ విచక్షణా రహితం గా దోచుకుంటున్నారు ప్రజలను ! ఈ మధ్య నే మహా రాష్ట్ర లో తీవ్రమైన నీటి కరువు వచ్చి , మొక్కల కు సరఫరా చేసే నీటి ట్యాంకు వెంబడి , తాము ఆ నీటిని తాగటానికి పరుగులు తీసే ప్రజలను ,కూడా చూశాము !
ముందు ముందు , సీసాలలో నింపి ఉన్న, మనం పీల్చే గాలిని కూడా కొనడానికి సిద్ధ పడదామా ?!!!
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !