Our Health

Archive for జూలై, 2020|Monthly archive page

ఆల్కహాల్ పాయిజనింగ్ లక్షణాలు ఎట్లా కనిపిస్తాయి ? 2.

In Our Health on జూలై 23, 2020 at 6:41 సా.

 క్రితం టపాలో ఆల్కహాల్ పాయిజనింగ్ అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా !ఇప్పుడు ఆల్కహాల్ ఒకే సారి అతిగా తాగిన వారిలో కనిపించే లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం !

 ఈ విషయాలు తెలుసుకోవడం మీకు  మద్యం తాగే  అలవాటు లేక పోయినా కూడా , మీరు తెలుసుకుంటే , మీ స్నేహితులను కానీ , లేదా అతిగా తాగిన అపరిచిత వ్యక్తులు కానీ , మీకు తారస పడితే , మీరు వారి ప్రాణాలను క్షించ గలుగుతారు ! 

 క్రితం టపాలో చెప్పుకున్నట్టు , ఆల్కహాల్ తాగిన వారికి , ఆ తాగిన ఆల్కహాల్ ప్రమాద కరం గా మారడం అనేక విషయాల మీద ఆధార పడి ఉంటుంది ! ఇక లక్షణాల గురించి చెప్పుకుంటే , మీకు ఆ అతిగా తాగిన వ్యక్తి ,

1. వికారం గా కడుపు లో తిప్పిన వారి లాగా ప్రవర్తించడం , లేదా వాంతులు చేసుకోవడం ,

 2. మతి స్థిమితం కోల్పోయినట్టు అంటే  కంఫ్యూస్ అయినట్టు ఉండడం ,3. కళ్ళు తిరిగి పడి పోబోతున్నట్టు ఉండడం కానీ,

4. లేదా పడి పోవడం గానీ జరగొచ్చు !

5. అంతే కాకుండా వారికి మూత్ర విసర్జన మీద కంట్రోలు తప్పి వారు వేసుకున్న ప్యాంట్ లో కానీ ధోవతి లో గానీ , లేదా జీన్ ప్యాంట్ లో కానీ మూత్ర విసర్జన చేసుకుని , ఆ తడి ప్రాంతాలు బయటి వారికి స్పష్టం గా కనబడడం కానీ జరగ వచ్చు ! 

6. ఇంకో ప్రమాద సంకేతం ఏమిటంటే  వారి శ్వాస తీసుకోవడం కష్టం అవడం ! ఈ లక్షణం కనబడడానికి కారణం : అతిగా తాగితే , మన దేహం లో ప్రవేశించిన మద్యం శాతం ఎక్కువ అయి , అన్నవాహిక కూ , శ్వాసనాళానికీ మధ్య  కవాటం గా పని చేసే  నాలుక వెనుక భాగం  బలహీనం అవుతుంది . అప్పుడు నోటిలో ఉండే ( వాంతి  మిగతా ద్రవాలు ) నేరుగా శ్వాసనాళం ద్వారా ఊపిరి తిత్తులలో ప్రవేశిస్తాయి !  ఆ పరిస్థితి ని గొంతుకు ఏదైనా పదార్ధం అడ్డం పడడం  తో పోల్చుకోవచ్చు !ఇక వీరి రక్త పరీక్ష చేసి చూస్తే ,  మద్యం శాతం ఎక్కువ గా ఉండడం తో పాటుగా , వారి రక్తం లో చక్కర శాతం చాలా తక్కువ గా అయి , ఆ పరిస్థితి  మెదడు లోని నాడీ కణాలు నశించే ప్రమాదం ఉంటుంది ! 


వచ్చే టపాలో మరి  సహాయం చేసే వారి కర్తవ్యం  ఏమిటో కూడా తెలుసుకుందాం ! అంటే  ప్రధమ చికిత్స ! 
ఈ విషయం మీద మీకు  వచ్చే క్లిష్టమైన సందేహాలూ , ప్రశ్నలూ తెలియచేయండి ! 

ఆల్కహాల్ పాయిజనింగ్ గురించి యువత ఎందుకు తెలుసుకోవాలి ? 1.

In Our Health on జూలై 18, 2020 at 6:16 సా.

 మద్యం తాగడం ఈ రొజుల్లో   ఒక అలవాటు లేదా ఫ్యాషన్ గా మారుతోంది , భారత దేశం లో ! అనేక రకాలు గా మద్యం తాగడాన్ని  అన్ని వయసుల వారిలోనూ , ముఖ్యం గా యువత లోనూ ప్రేరేపిస్తున్నారు, వారికి ప్రజల మీద ప్రేమ ఉండి కాదు ! కేవలం , వారి స్వార్ధం కోసం !  మద్యం వ్యాపారం అనేక వేల కోట్ల వ్యాపారం !  ఈ వ్యాపారం చేసే వారికి , ప్రజలు ఎంత నిదానం గా దానికి బానిస అవుతూ , వారి ఇల్లూ , ఒళ్ళూ , బ్యాంకు ఖాతాలూ  గుల్ల చేసుకుంటూ ఉంటే , అంత మంచిది , అంత లాభ సాటి ! అతిగా మద్యం తాగడం,  అందులోనూ ఒకేసారి అంటే బింజ్  డ్రింకింగ్  ను కూడా యువత ఒక ఆట గా మార్చి పోటీలు పడి మరీ  తాగుతున్నారు ! ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే , అంతర్జాలం  గురించీ,  ప్రపంచం లో  వస్తున్న  అనేక రకాలైన సాంకేతిక మార్పులను కూడా అవలీలగా నేర్చుకునే చురుకు దనం  ఉన్న యువత కు  , తాగడం వల్లా , ఒకే సారి అతిగా తాగడం వల్ల  కలిగే ప్రమాదాల గురించి  జీరో అంటే సున్నా అవగాహన మాత్రమే ! 
ఒకే సారి అతిగా తాగడం అంటే ఏమిటి ? ( ఆల్కహాల్ పాయిజనింగ్  లేదా ఆల్కహాల్ టాక్సిసిటీ ) : ఎక్కువ పరిమాణం లో ఆల్కహాల్  తక్కువ సమయం లో తాగడం !కడుపులో ఆహారం అతి తక్కువ గా ఉన్న సమయం లో , తాగిన మద్యం అతి త్వరగా  మన రక్తం లో కలుస్తుంది ! సాధారణం గా  తాగే వారు , ఆఫీసులు మూసేశాక,  ఇంటికి వెళ్లే సమయం లో , తాగుతూ ఉంటారు ! విద్యార్థులు కూడా , కాలేజీలు , అయ్యాక ఇంటికి  వెళ్లే ముందు ( ఖాళీ కడుపు తో ) తోటి విద్యార్థులతో  సరదా గా తాగుతూ ఉంటారు ! ఆ సమయం లో,  సహజం గానే వారు ఆకలి తో ఉండి , అప్పుడు వారు  తాగే మద్యం త్వర త్వర గా రక్తం లో కలుస్తుంది ! ఇక్కడ గుర్తు ఉంచుకోవలసిన విషయం :  ఎంత మద్యం తాగితే అది  ప్రమాదం అవుతుంది ? అనే విషయం ఖచ్చితం గా  ఎవరికీ తెలియదు ! అంటే , మద్యం ప్రమాదకరం గా  కొన్ని పరిస్థితులలో అంటే ,  వయసు , వారు ఆకలి తో ఉన్నారా లేదా , వారి బరువు , వారు ఎంత తక్కువ సమయం లో తాగుతున్నారు ? అనే అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది ! 

Blood Alcohol Concentration | Aware Awake Alive


మద్యం శాతం అంటే గాఢత లేదా concentration  శరీరం లో ఎక్కువ అవుతే , ఏమౌతుంది ? !
1. మెదడు  ఆలోచించడం మందకొడి గా ఉంటుంది ! అంటే చురుకుదనం తగ్గుతుంది !

2. కడుపు లో మంటా ,వికారం గా అవడం , ఇంకా  కొందరిలో , వాంతులు చేసుకోవడం కూడా జరుగుతుంది !

3. గుండె కొట్టుకోవడానికీ , ఇంకా శ్వాస తీసుకోవడానికీ  కారణమయే  నాడులు  అతి మద్యం వల్ల  ప్రభావితమై , ఆ చర్యలు మందగించుతాయి ! 

4. డీహైడ్రేట్ అంటే శరీరం లో లవణాలు తక్కువ అవుతాయి . 

5. శరీర ఉష్ణోగ్రత తగ్గి  ప్రమాదకరం గా , హైపోథర్మియా అనే పరిస్థితి ఎదురవుతుంది !

6. శరీరం లో షుగర్ తగ్గి  స్పృహ తప్పే ప్రమాదం ఉంటుంది ! ఎందుకంటే , మన మెదడు లో తక్కువ షుగర్ పరిస్థితి ఏర్పడితే , మెదడు  లోని  నాడీ కణాలు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది !
తరువాతి టపా లో , ఆల్కహాల్ పాయిజనింగ్ లేదా ఒకే సారి అతిగా తాగిన వారి లో ఏ లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం ! 

పై విషయం గురించి మీకున్న కష్టమైన సందేహం తెలియ చేయండి ! 

కరోనా కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు-2.

In Our Health on జూలై 11, 2020 at 2:17 సా.

క్రితం టపాలో కరోనా సమయంలో, మన శరీర ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాము కదా ! ఇప్పుడు మనం మానసిక ఆరోగ్య విషయాల  గురించి తెలుసుకుందాం!

ఏదైనా తీవ్రమైన విపత్తు సంభవించినప్పుడు మానవుల ఆలోచన ఆలోచనా  ధోరణులు ,  బాల బాలికలలో  ఒక రీతిగా నూ , యుక్త వయస్కులలో ఇంకో రీతిగా నూ ,  ఇంకా వయోవృద్ధులలో  ఇంకో రకంగాను ఉంటాయి. ఏ వయస్సుకు చెందిన వారైనప్పటికీ ,మన పరిసరాలలో జరుగుతున్న మార్పులు తీవ్రంగా ఉన్నప్పుడు అవి  అందరినీ  ఆందోళనకు గురిచేస్తాయి.  ప్రత్యేకించి,  కరోనా అంటువ్యాధి, దాని పరిణామాలు స్పష్టంగా తెలియకపోవటం ,  వ్యాధి బారిన పడుతున్న వారు ఎక్కువ అవుతూ ఉండడం ,  ఇంకా మరణాల రేటు పెరుగుతూ ఉండటం కూడా ఆందోళన కలిగించడం  సహజమే ! 

 ఈ ఆందోళనలు  అనేక రకాలుగా బయటపడవచ్చు . యధాలాపంగా ఉండటమూ ,  ఆహారం సరిగ్గా తినకపోవడం, తగినంత నిద్ర పో లేకపోవటం , ఇంకా భయంకరమైన , ఆందోళన కలిగించే  కలలు  నిద్రాభంగం చేయడమో , అదేపనిగా తమ గురించి తమ బంధు మిత్రుల గురించి వారి యోగక్షేమాల గురించి ఆలోచించి తీవ్రమైన మానసిక వత్తిడి కి గురౌతూ ఉండడం కూడా  జరుగుతుంది. చీటికీ మాటికీ  అంటే స్వల్ప విషయాలకే , చీకాకు పడుతూ ఉండడం , ఉద్రేకం చెందడం , నిరాశా నిస్పృహ లకు లోనవడం లాంటి లక్షణాలు కూడా  గమనించ వచ్చు. 

ఈ లక్షణాలు మూడు వారాల కన్నా ఎక్కువ గా కనుక ఉంటే అది కుంగుబాటు గా మారవచ్చు . అంటే క్లినికల్ డిప్రెషన్.  ఈ క్లినికల్ డిప్రెషన్ ను  కనుక మొగ్గలోనే తుంచి వేయక పోతే , ఆ లక్షణాలు ఉన్నవారు తీవ్ర పరిణామాలు  ఎదుర్కోవచ్చు. అంటే, విపరీతంగా బరువు తగ్గిపోవడం తాము చదువుతున్న విద్యలో ఏకాగ్రత కోల్పోవడం జరగవచ్చు,  లేదా  ఉద్యోగస్తులు  , తాము చేస్తున్న ఉద్యోగంలో తగినంత శ్రద్ధ చూపకుండా పై అధికారుల విమర్శలకు, నిందలకు లక్ష్యం అవ్వచ్చు. ఇవన్నీ ఒక రకం అవుతే, కరోనా లక్షణాల మీద సరియైన అవగాహన లోపించి చిన్నపాటి జలుబు, జ్వరం రాగానే విపరీతంగా ఆందోళన చెంది బాధపడటం కూడా ఇంకొందరిలో కనబడుతుంది.  

చిన్నపిల్లల్లో కనపడుతున్న ఆందోళనలను తల్లిదండ్రులు ముందే  గమనించి ,  వారికి తగిన విధంగా సమాధానాలు చెబుతూ  ఉండాలి. వారు తీసుకోవలసిన జాగ్రత్తల మీద ఎక్కువ దృష్టి పెడుతూ  కరోనా వైరస్ మీద అవగాహన పెంచాలి.  ముఖ్యంగా తరచూ చేతులు కడుక్కోవడం, ముఖం మీద అశుభ్రమైన చేతులు పెట్టకొకపోవడం,  ఇంకా గుంపుల లోనూ సమూహాల లోను ఎక్కువగా తిరగకపోవడం లేదా ఆడకపోవటం  లాంటి జాగ్రత్తలను  తల్లిదండ్రులు వారికి  విడమరచి చెప్పాలి.  అంతేకాకుండా వారితో ఎక్కువ సమయాన్ని గడపటానికి ప్రయత్నం చేయాలి. ఇక యవ్వనులు కూడా లాక్ డౌన్ విధించటం మూలంగా వారి వివిధ కార్యక్రమాలు కేవలం ఇంటికే పరిమితమవ్వడం  వలన  ఎక్కువ సమయాన్ని ఇంటర్నెట్లో ఉపయోగించడము లేదా అతిగా తినడం నిద్రపోకుండా కంప్యూటర్ గేమ్స్ ఆడటం కూడా జరుగుతుంది.  ఆన్లైన్లో గేమ్స్ ఆడటం ఇంకా జూదం లేదా ఆన్లైన్ బెట్టింగ్ చేయటము కూడా యవ్వన వయస్కులలో అనేక రెట్లు ఎక్కువ అయినట్టు పరిశీలనలు తెలుపుతున్నాయి. 

అంతే  కాకుండా ,  కరోనా అంటువ్యాధి  సమయానికి  ముందే  మానసిక సమస్యలతో , లేక మానసిక వ్యాధులతో  ( అంటే కుంగుబాటు లేదా డిప్రెషన్ , ఇంకా స్కిజోఫ్రీనియా , మ్యానియా  అంటే పిచ్చి  లాంటివి ) సతమవుతున్న వారి వ్యాధులు  ఇంకా ఉధృతం అయే  ప్రమాదం కూడా ఉంటుంది , ఈ కరోనా కాలం లో . వారికి కరోనా వ్యాధి అంటక పోయినా కూడా !

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు తెలుసుకుందాం !

కరోనా కాలంలో జాగ్రత్తలు- 1

In Our Health on జూలై 3, 2020 at 9:52 సా.

కరోనా మహమ్మారి ( Covid 19 ) గత ఆరు నెలలుగా ప్రపంచమంతటా దాదాపుగా అన్ని దేశాలలో చేస్తున్న మారణహోమం అంతా ఇంతా కాదు. లక్షలాది అమాయక ప్రజలు కరోనా బారిన పడుతున్నారు, వేలల్లో చనిపోతున్నారు కూడా ! 

వివరాలు గమనిస్తే,  ఈ కోవిడ్ అంటువ్యాధి బాధితులు 90 శాతం పైగా కోలుకుంటున్నారు. కేవలం ఒక ఐదు పది శాతం ప్రజలు మాత్రమే , ఈ కరోనా  అంటువ్యాధి తో దీర్ఘకాలిక వ్యాధి పరిణామాలు అనుభవిస్తున్నారు, కొందరు వాటిని కూడా తట్టుకోలేక మరణిస్తున్నారు.  ఇక ఈ కాంప్లికేషన్స్ వచ్చినవారు ఎందుకు మరణిస్తున్నారు ? అని పరిశీలిస్తే ,అనేక రకాలైన కారణాలు కనిపిస్తున్నాయి.  అందులో ముఖ్యమైన కారణం, ఊపిరితిత్తులలో ప్రాణవాయువు మార్పిడి తగ్గి పోవడం. మనం తీసుకునే  శ్వాస లో ఉన్న ప్రాణ వాయువు ( అంటే ఆక్సిజన్ ) మన రక్తంలో కలిసేది ఊపిరితిత్తుల లోనే కదా !

ఈ కొవిడ్ అంటు వ్యాధి వల్ల ఆ రక్తంలో ప్రాణవాయువు  కలిసే ప్రక్రియ చాలా వరకు కుంటు పడి , తద్వారా మెదడుకి చేరవలసిన ప్రాణవాయువు క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది. మన దేహం లో మిగతా అన్ని భాగాల కన్నా, మెదడుకు ప్రాణవాయువు అందక పోతే , మూడు నాలుగు నిమిషాల లోనే ,  మెదడు పని చేయటంలో అవకతవకలు కలుగుతాయి .  ఇది ఒక రకమైన సీరియస్ కాంప్లికేషన్ అవుతే ,రక్తనాళాల లో ఈ అంటు వ్యాధి వల్ల  మార్పులు కలిగి , తద్వారా రక్తం చిన్న చిన్న గడ్డలు గా  మారటం , ఆ మారిన గడ్డలు ( లేదా క్లాట్స్  ) మెదడులోకి ప్రవేశించి ,మెదడులోని రక్తనాళాలు మూసి పక్షవాతం రావటానికి కారణమవడం ఇంకో రకమైన సీరియస్ కాంప్లికేషన్ ( లేదా తీవ్ర పరిణామం ). ఇట్లా జరిగితే  పక్ష వాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. 

ఈ కోవిడ్ లేదా కరోనా వైరస్ మానవులకు జంతుజాలం ద్వారా సంక్రమించే ఒక కొత్త వ్యాధి అవటం మూలాన ఈ వైరస్ మానవులలో ఏ ఏ విధంగా హాని చేస్తుందో కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది . 

ఇక ఈ కరోనా  వైరస్ అంటువ్యాధి కి నివారణ కేవలం టీకా లేదా వ్యాక్సిన్  ద్వారా మాత్రమే.  ఈ వ్యాక్సిన్ను కనుక్కోడానికి కూడా ప్రపంచం అంతటా వివిధ దేశాలలో శరవేగంగా ప్రయత్నాలు ప్రయత్నాలూ  ,ప్రయోగాలూ  జరుగుతున్నాయి. ఇవన్నీ త్వరలోనే ఫలిస్తాయని ఆశిద్దాం ! 

ఈ కోవిడ్  వ్యాధి సంక్రమించిన వారిలో  , కొద్దిపాటి లక్షణాలతో కోలుకుంటున్న వారు 90 శాతానికి పైగా ఉన్నారని తెలుసుకున్నాం కదా ,  ఇట్లా కొద్దిపాటి లక్షణాలతో  కోలుకోవటానికి కూడా శాస్త్రజ్ఞులు అనేక కారణాలు కనుక్కున్నారు. వాటిలో ఒక  ముఖ్యమైన కారణం, కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉండటం.  ఈ రోగనిరోధకశక్తినే ‘ ఇమ్యూనిటీ ‘ అంటారు. 

అనాదిగా ( భారతదేశంలో ముఖ్యంగా )  సంప్రదాయంగా వస్తున్న ఆహారపు అలవాట్లు రోగ నిరోధక శక్తి ఇనుమడింప చేస్తాయి.  ఈ అలవాట్లే , సమతుల్యమైన ఆహారం తినటం,  మనసును ప్రశాంతంగానూ , ఉల్లాసంగానూ  ఉంచుకోవటం,  కంటికి తగినంత నిద్ర పోవటం మొదలైనవి .  ఇక్కడ సమతుల్యమైన ఆహారం అంటే తగినంత సూర్యరశ్మి తో పాటుగా  పోషక పదార్థాలు కూడా సమతుల్యంలో ఉండాలి , అంటే స్థూలపోషకపదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలు.  స్థూల పోషక పదార్థాలు అంటే మనం తినే మాంసకృత్తులు, పిండి పదార్థాలు, ఇంకా నూనె పదార్థాలు. ఇక సూక్ష్మపోషక పదార్థాలు అంటే మన దేహానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు. వీటిని సూక్ష్మ పోషక పదార్థాలు అని ఎందుకంటారంటే , మన దేహానికి కేవలం మిల్లీ గ్రాముల లోనే వీటి అవసరం ఉంటుంది. కానీ ఆ మిల్లిగ్రాముల లో అవసరం అయ్యే ఈ సూక్ష్మ పోషక పదార్థాలు కూడా ఏవైనా కారణాల వల్ల మన దేహానికి లభించకపోతే,  వాటి లోపం వల్ల రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అందువల్ల సహజంగా వివిధ రకాలైన వైరస్ లనూ , బ్యాక్టీరియాలనూ  నిరోధించే రోగ నిరోధక శక్తి పెరగటానికి మనం రోజూ సమతుల్య మైన ఆహారం తినాలి . 

అంతేకాకుండా , అధిక రక్త పీడనం ( అంటే హై బ్లడ్ ప్రెషర్ ) ఇంకా మధుమేహం అంటే డయాబెటిస్ ఇంకా ఆస్తమా లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా ఆయా వ్యాధులను సాధ్యమైనంత నియంత్రణలో ఉంచుకోవటానికి ప్రయత్నించాలి . రోజూ తగినంత సమయం వ్యాయామం కూడా చేస్తూ ఉంటే, రోగనిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనల ద్వారా తెలిసింది. 

ఇప్పటివరకూ  మనం,  శారీరకంగా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలుసుకున్నాం కదా ! వచ్చే టపాలో మానసికంగా ఏ రకమైన జాగ్రత్తలు ఈ కరోనా కాలంలో తీసుకోవాలో తెలుసుకుందాం !

 ఈ టపా మీద మీ అభిప్రాయాలు తెలుపగలరు ! 

అవసరమవుతేనే బయటకు వెళ్ళండి ! , ముఖానికి మాస్కు తొడుగుకోండి !, చేతులు తరచూ కడుక్కోండి సబ్బుతో !  క్షేమం గా ఉండండి , ఉంచండి ! 

%d bloggers like this: