Our Health

Archive for the ‘ప్ర.జ.లు.’ Category

24.డయాబెటిస్ లో, రోజూ తినవలసిన కీలక పోషక పదార్ధాలు. ( key nutrients ).

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 15, 2013 at 12:46 సా.

24.డయాబెటిస్ లో రోజూ తినవలసిన కీలక పోషక పదార్ధాలు. ( key nutrients  ).

డయాబెటిస్ లో పథ్యం లో భాగం గా ఇంత వరకూ మనం , కార్బో కౌంటింగ్ , ఇంకా గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి , డయాబెటిస్ చికిత్స లో వాటి ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకున్నాం కదా ! ఇప్పుడు డయాబెటిస్ నిర్ధారణ అయినాక , వారి ఆహారం లో రోజూ ఉండవలసిన కీలక పోషక పదార్ధాల గురించి తెలుసుకుందాం ! 
అవి: 1. విటమిన్ బీ 12. 2. ఒమేగా ఫాట్టీ ఆమ్లాలు. 3. కాల్షియం. 4. విటమిన్ D. 5.ఇనుము లేదా ఐరన్. 
పైన ఉదహరించిన కీలక పోషక పదార్ధాలు ఆరోగ్య వంతుల తో పాటుగా , పూర్తి శాకాహారులకు కూడా చాలా కీలకమైనవి ! సామాన్యం గా ఈ పోషక పదార్ధాలు మాంస హారుల ఆహారం లో ఉంటాయి. అందు వల్ల వారు పైన చెప్పిన పోషక పదార్దాలనూ, ఖనిజాలనూ , అదనం గా తీసుకోనవసరం లేదు, టాబ్లెట్ ల రూపం లో కానీ టానిక్ ల రూపం లో కానీ ! కానీ శాక హారులకు ఆ అవసరం ఉంటుంది. ప్రత్యేకించి శాకాహారులు అయి ఉండి , వారికి డయాబెటిస్ కూడా వచ్చి ఉంటే , ఈ కీలక పోషక పదార్ధాలు ఇంకా అవసరం అవుతాయి ! డయాబెటిస్ నియంత్రణ కు వేసుకునే కొన్ని మందులు ( ఉదాహరణ కు: మెట్ ఫార్మిన్ )  కొంత కాలం వాడాక , బీ విటమిన్ లోపం కలిగిస్తాయి శరీరం లో ! ఆ లోపం వల్ల , కాళ్ళూ , చేతులూ తిమ్మిరి గా ఉండడం , స్పర్శ జ్ఞానం మందగించడం, ఉష్ణ శీతలాలు స్పష్టం గా తెలియక , ప్రమాదాలకు లోనవడం కూడా జరుగుతూ ఉంటుంది ! ఈ కీలక పోషక పదార్ధాలు పుష్కలం గా ఉండే ఆహారం ( పాలూ , పళ్ళూ , జున్ను అంటే చీజ్ , పెరుగు , బ్రాకోలీ , తాజా ఆకు కూరలూ , ) తీసుకుంటూ ఉండాలి రోజూ ! ఒమేగా ఫాటీ ఆమ్లాలు ,  పండ్ల లో ఉండే విటమిన్ సీ  లు మన శరీరం లో , ప్రత్యేకించి రక్త నాళాలలో చెడు కొవ్వు పేరుకుని , రక్త నాళాలు పెళుసు గా అవ కుండానూ , అధిక రక్త పీడనం రాకుండా నూ నిరోధిస్తాయి !  విటమిన్ సీ  తో పాటుగా ఇనుము పుష్కలం గా ఉండే ఆకు పచ్చని ఆకు కూరలూ , కూరగాయలూ తింటూ ఉంటే , వాటిలోని ఇనుము సరిగా  శరీరం చేత ” పీల్చ బడుతుంది ” అప్పుడు మనం  ఆహారం లో తీసుకునే ఇనుము వృధా గా పోవడం జరగదు ! విటమిన్ డీ కూడా మన శరీరం లోని ఎముకల బలానికే కాకుండా , డయాబెటిస్ లో చెక్కెర కంట్రోలు కు కూడా ఎంతో ఉపయోగకరమూ , కీలకమూ అయిన విటమిన్ అని ఇటీవల పరిశోధనలు నిర్ధారించాయి ! మన భారత దేశం లో ఉండే వారికి రోజూ పది పదిహేను నిమిషాలు శరీరానికి ఎండ తగిలితే సరిపడినంత డీ ( D ) విటమిన్ లభ్యం అవుతుంది ! ఉచితం గా నే !ఆ పరిస్తితులు లేని ప్రదేశాలలో నివసించే వారు, ఫోర్టి ఫైడ్ పాలు, సీరియల్స్ , కానీ బ్రెడ్తో   కానీ  శరీరానికి ( ఆరోగ్యానికి ) సరిపడేంత డీ విటమిన్ పొంద వచ్చు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

23.డయాబెటిస్ ఉన్న వారు, ” లో జీ ఐ ” ( low glyceamic index ) ఆహారం ఎందుకు తినాలి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 12, 2013 at 11:13 ఉద.
23. డయాబెటిస్  ఉన్న వారు,  ”  లో జీ ఐ ” ( low glyceamic index ) ఆహారం ఎందుకు తినాలి ?
GI  అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ :  ఈ పదము, మనం తినే ఆహారం, మన రక్తం లో షుగరు ను ఏ మాత్రం ఎక్కువ చేస్తుందో తెలియ చేస్తుంది ! 
డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు, వారు తినే ఆహారం వారి రక్తం లో చెక్కెర ను  ఒక్క సారిగా ఎక్కువ కాకుండా చూసుకుంటూ ఉండాలి ! అందువల్ల వారు GI , లేదా గ్లైసీమిక్ ఇండెక్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి !  GI లేదా జీ ఐ  ఎక్కువ గా ఉన్న ఆహార పదార్ధాలు చాలా త్వరగానూ ఎక్కువ గానూ రక్తం లో చెక్కెర ను ఎక్కువ చేస్తాయి ! GI తక్కువ గా ఉన్నవి , గ్లూకోజు ను నిదానం గా ఎక్కువ చేయడం జరుగుతుంది. అందుకే , GI తక్కువ గా ఉన్న ఆహారం డయాబెటిస్ వ్యాధి కి ఉత్తమం !
ఈ ఎక్కువ తక్కువ GI  ఉన్నట్టు ఎట్లా కనుక్కోవడం ?:  సామాన్యం గా ఈ GI  ని  పంచదార లేదా చెక్కెర ని కానీ , లేదా తెల్ల బ్రెడ్ ను ( అంటే వైట్ బ్రెడ్ )  మనం తింటే ఎంత త్వరగా మన రక్తం లో చెక్కెర ఎక్కువ అవుతుందో , దానితో ఇతర ఆహార పదార్ధాలను పోల్చి చూసి  GI ను లెక్క కడతారు ! 
మరి ఈ GI ను ఏ  ఏ  పరిస్థితులు ప్రభావం చేస్తాయి ?
మనం తినే ఆహారం లో కొవ్వు , ఇంకా పీచు పదార్ధాలు ఎంత ఎక్కువ ఉంటే , వాటి GI  అంత తక్కువ గా ఉంటుంది !  ఉదాహారణకు :  సామాన్యం గా బ్రెడ్ ను బ్రౌన్ బ్రెడ్ అనీ , వైట్ బ్రెడ్ అనీ అమ్ముతూ ఉంటారు !  వాటి పేర్ల లాగానే , తెల్ల బ్రెడ్ లో పీచు పదార్ధం తీసి వేసిన గోదుమ పిండి తో చేసిన బ్రెడ్ , ఇంకా  గోధుమలు యధాతధం గా  పిండి చేసి చేసిన బ్రెడ్ ను బ్రౌన్ బ్రెడ్ అంటారు ! ( హోల్ వీట్ బ్రెడ్ అని కూడా అంటారు ) డయాబెటిస్ ఉన్న వారు, బ్రౌన్ బ్రెడ్ తినడమే శ్రేయస్కరం ! ఎందుకంటే , ఈ బ్రౌన్ బ్రెడ్ లో పీచు పదార్ధం ఎక్కువ గా ఉంటుంది కాబట్టి , అది తింటే , వెంటనే గ్లూకోజు పెరగదు ! అంటే దాని GI తక్కువ అన్న మాట ! తెలుగు వారం , మనం ఎక్కువ గా వరి అన్నం అంటే రైస్ తింటాం కదా , మరి  ఈ వరి అన్నం కూడా బాస్మతి బియ్యం లో జీ ఐ అంటే నిదానం గా గ్లూకోజును పెంచుతుంది ! అందువల్ల మామూలు బియ్యం కంటే బాస్మతి బియ్యం మేలు ! అట్లాగని  తినే బాస్మతి అన్నం పరిమాణం ఎక్కువ చేయకూడదు ! ప్రతి భోజనం లోనూ ,ఒక కప్పు కన్నా ఎక్కువ అన్నం తినడం మంచిది కాదు డయాబెటిస్ ఉన్న వారు. ఎందుకంటే, మిగతా కూరలూ, పప్పూ , పెరుగూ అవన్నీ కలిపి ఎన్ని క్యాలరీలు ఉంటుందో , ఆ క్యాలరీలను నియమితం గా ఉంచుకోవాలి ప్రతి భోజనం లోనూ , ప్రతి రోజూ ! వరి అన్నం తినడం అలవాటు తప్పిన వారు పుల్కాలు తినడం మంచిది ! పుల్కాలు గోధుమ పిండి తో చేసేవి అయినా కేవలం నిప్పుల మీద కానీ , లేదా పెనం మీద ,నూనె వేయకుండా కాల్చడం జరుగుతుంది కనుక  ఆరోగ్యానికీ మంచిది ! ( ప్రతి భోజనం లోనూ , ఒకటి రెండు మాత్రమే అనే విషయం మర్చి పోకూడదు ! ) 
గమనించ వలసినది : కొవ్వు కూడా GI ని తగ్గిస్తుందని , కొవ్వు ఎక్కువ గా ఉన్న ఆహారం తినకూడదు. ఎందుకంటే , కొవ్వు , ఇతర విధాలు గా శరీరానికి హాని చేస్తుంది కనుక ! ఇంకా , బాగా ఎక్కువ సేపు ఉడికించిన ఆహారం కూడా , GI ని ఎక్కువ చేస్తుంది ! డయాబెటిస్ వ్యాధి ఉన్న వారు ఖచ్చితం గా తక్కువ GI  ఉన్న ఆహారాన్నే ఎప్పుడూ తినడం కష్టం. వారు GI తక్కువ గా ఉన్న ఆహారం, ఎక్కువ గానూ , GI ఎ క్కువ గా ఉన్న ఆహారం తక్కువ గానూ తింటూ ఉండాలి రోజూ !  ముఖ్యం గా వారు రోజు వారీ ఆహారం లో క్యాలరీలు నియమితం గా ఉండేట్టు చూసుకోవాలి ! 
 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

22. డయాబెటిస్ పథ్యం, ముఖ్య సూత్రాలేంటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 11, 2013 at 2:45 సా.

22. డయాబెటిస్ పథ్యం, ముఖ్య  సూత్రాలేంటి ?

డయాబెటిస్ లో, పథ్యం యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని టపాలను ఇప్పటికే రాయడం జరిగింది కదా ! ఇప్పుడు  డయాబెటిస్ నిర్ధారణ అవగానే ,పథ్యం లో పాటించ వలసిన మూల సూత్రాల గురించి తెలుసు కుందాం, వివరం గా !  గమనించ వలసినది , ఈ మూల సూత్రాలన్నీ శాస్త్రీయమైనవి 
కేవలం, ఉబుసు పోక మాట్లాడుకునే విషయాలు కాదు , కాబట్టి , సందేహాలు ఏమైనా ఉంటే తెలుపవచ్చు.
 
డయాబెటిస్ లో పథ్యం చేసే సమయం లో పాటించ వలసిన మూల సూత్రాలు :
1. పిండి పదార్ధాల గణనం , అంటే కార్బో కౌంటింగ్ :
2. గ్లైసీమిక్ ఇండెక్స్ 
3. కీలక పోషక పదార్ధాలు. 
4. రోజూ మీ ప్లేటు ఎట్లా సిద్ధం చేసుకోవాలి ?
5. ప్రత్యెక సందర్భాలలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ?
 
1.కార్బో కౌంటింగ్ : మనం తినే ఆహారం లో ప్రధానం గా పిండి పదార్ధాలు , అంటే కార్బోహైడ్రేటు లు , గ్లూకోజు గా మారుతాయి ! అంటే మన రక్తం లో గ్లూకోజు హెచ్చు తగ్గులకు ముఖ్యం గా మనం ఎంత కార్బోహైడ్రేటు లు ప్రతి సారీ తింటున్నామో , దానిని బట్టి ఉంటుంది ! 
మరి ఈ కార్బోహైడ్రేటులు ఏ  ఏ  ఆహార పదార్ధాల లో ఉంటాయి ?:
కూరగాయలలో : ఆలుగడ్డలు లేదా బంగాళా దుంపలు , మొక్కజొన్న లాంటి వి. 
పప్పు దినుసులలో సోయా , కంది పప్పు , శెనగ పప్పు , మినప్పప్పు లాంటి పప్పు ధాన్యాలు. 
ధాన్యాలలో , వరి , గోధుమ , మొదలైనవి. అంటే వాటితో చేసిన అన్నం , చపాతీలు, మరి ఇతర  వంటలు ఏమైనా కూడా ఉదా: పూరీలు , ఉప్మా , లాంటివి కూడా ! 
పళ్ళ లో తీయటి పళ్ళు అన్నీ ! ఉదా: అరటి పండు , పైన్ యాపిల్ , యాపిల్ , ద్రాక్ష , నారింజ మొదలైనవన్నీ కూడా !
పానీయాలలో , కోకా కోలా, పెప్సీ , థమ్సప్ , మాజా లాంటి పానీయాలన్నీ !
ఇక స్వీట్లూ , బిస్కట్లూ ,చాక్లెట్ లూ , ఐస్ క్రీం లూ చెప్పనవసరం లేదు ఎందుకంటే అవన్నీ కూడా చెక్కెర బాగా వేసి చేసినవి కనుక , తిన్న వెంటనే మన రక్తం లో గ్లూకోజు ను చాలా ఎక్కువ చేస్తాయి ! సాధారణం గా ప్రతి సారీ భోజనం లో 45 నుంచి  60 గ్రాముల కార్బో హైడ్రేటు లు ఉండాలి ! ఈ అరవై గ్రాములూ కేవలం తినే అన్నం కానీ , గోధుమ పిండి తో చేసిన చపాతీ మాత్రమే కాక భోజనం లో, కడుపు లోకి వెళ్ళే  మొత్తం కార్బోహైడ్రేటు లు అని అర్ధం అంటే కేవలం అరవై గ్రాముల ఆన్నమే తింటే , మిగతా పప్పు , పెరుగు , స్వీట్ల మాటేంటి ? అవన్నీ కూడా తింటాం కదా ! అప్పుడు వాటిలో ఉండే కార్బోహైడ్రేటులు కూడా కలిసి మొత్తం అరవై గ్రాముల వరకే ఉండాలన్న మాట ! ఈ అరవై గ్రాముల కార్బో హైడ్రేటు లు ఒక సారి భోజనం లో అని గమనించాలి !  వివిధ  ఆహార పదార్ధాలు ఎంతెంత పరిమాణం అరవై గ్రాములు ఉంటాయో , పథ్యం చేసే వారు తప్పని సరిగా తెలుసుకోవాలి ! లేదా ఒక మాదిరి గా తింటూ , రక్త పరీక్షలు తరచూ చేయించు కుంటూ ఉండాలి ! వచ్చే టపాలో గ్లైసీమిక్ ఇండెక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం ! అప్పుడు మనకు కార్బో హైడ్రేటు లు నియమితం గా ప్రతి భోజనం లో తినాలో తెలుసుకోవడం శులభం అవుతుంది !
( ఈ క్రింద సూచించిన వెబ్ సైట్ లోకి వెళితే ( ఈ అడ్రస్ మీరు ప్రత్యేకం గా టైపు చేసి  వెదకాలి ) మన భారత దేశ వంటకాల కార్బోహైడ్రేటు  పాళ్ళు ఎంత ఉన్నాయో తెలిపే వివరాలు లభ్యం అవుతాయి. )
http://www.nufs.sjsu.edu/pdf/CarbCountSAsians.pdf
 

21. వందేళ్ళు బతికించే , ”ఒకినావా పథ్యం ” లో ప్రత్యేకత ఏమిటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 10, 2013 at 9:01 సా.

21. వందేళ్ళు బతికించే , ”ఒకినావా పథ్యం ”  లో ప్రత్యేకత ఏమిటి ?

క్రితం టపాలలో, డయాబెటిస్ వ్యాధి లో ప్రతి దశలోనూ , అంటే మందులు తీసుకుంటున్నా , తీసుకోకున్నా కూడా, పథ్యం చేస్తే ఉండే ఉపయోగాల గురించి చర్చించుకున్నాం కదా !  అల్లోపతీ వైద్యం లో కూడా , ఈ పథ్యం యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది ! కాకపొతే , అల్లోపతీ వైద్యం లో మిగతా వైద్య పద్ధతులలో లాగా ,పథ్యం ప్రాముఖ్యత ను రోగులకు వివరించరు ! ప్రత్యేకించి భారత దేశం లో ! పాశ్చాత్య దేశాలలో , ముఖ్యం గా ఇంగ్లండు, ఆస్ట్రేలియా , కెనడా , అమెరికా మొదలైన దేశాలలో , ప్రతి జబ్బు గురించీ , ఆ జబ్బును ఒక వ్యక్తి లో నిర్ధారణ అయిన వెంటనే ,  ఆ జబ్బు లేదా వ్యాధికి సంబంధించిన అన్ని వివరాలనూ ,  ఆ వ్యక్తి కి వివరిస్తారు ! ఆ వ్యక్తి , తనకు కొత్తగా నిర్ధారణ అయిన జబ్బు గురించి కూలంక షం గా తెలుసుకోవడానికి తగినంత సమాచారం అందిస్తారు ! ఇంకా సందేహాలుంటే కూడా తీరుస్తారు !  వివిధ కారణాలవల్ల ఆ పని భారత దేశం లో చేయరు !  ఒక గంట ఒక పేషంటు తో  ఆ వ్యాధి గురించి ” సుత్తి ” కొట్టి రెండు వందలు తీసుకునే బదులు , కేవలం  వారికి అయిదు నిమిషాలలో , మందులు రాసిచ్చి ,  మిగతా యాభై అయిదు నిమిషాలలో, కనీసం పదకొండు మంది ని చూసి, వారి దగ్గర నుండి , తలా రెండు వందలు తీసుకోవడం ఎక్కువ లాభ దాయకం కదా ! ( నేను కూడా  భారత దేశం లో ఉంటే,  అదే పని చేసే వాడినేమో ! ) 
ఇక అసలు విషయానికి వద్దాం ! 
ఒకినావా ! జపాను దేశానికి దక్షిణాన ఉన్న చిన్న చిన్న ద్వీపాల సముదాయం లో ఒకటి ! ఈ ద్వీపం ప్రత్యేకత ఏమిటి ?  ఈ చిన్న ద్వీపం లో ప్రపంచం లో ఎక్కడా లేనంత మంది , వంద ఏళ్లు దాటిన వారు నివసిస్తూ ఉన్నారు ! అంటే , ఈ ద్వీపం లో ఎక్కువ మంది వంద ఏళ్ళు దాటాక కూడా ఆరోగ్యం గా జీవిస్తున్నారు ! దానితో సహజం గానే అనేక మంది శాస్త్రజ్ఞులకు ఉత్సుకత జనించి , ఈ శతాయుషు కు గల కారణాలు పరిశీలిస్తే ,వారికి ఈ క్రింది విషయాలు స్పష్టమయాయి ! 
1. ఒకినావా వాసుల పథ్యం లో అంటే డైట్ లో , మిగతా జపాను వాసులకంటే ఇరవై శాతం తక్కువ క్యాలరీలు ఉంటాయి !
2. వారి పథ్యం లో ప్రత్యేకించి ,  యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలం గా  ఉంటాయి ! అంటే విటమిన్ లూ , ఖనిజాలూ పుష్కలం గా లభించే సహజ  మైన కూరగాయలు ,తాజా కూరగాయలు , పళ్ళు , దుంపలు , ఆకు కూరలూ , తప్పని సరిగా వారి రోజు వారీ వంటలలో , భోజనాలలో ఉండాల్సిందే !
ఈ యాంటీ ఆక్సిడెంట్ లు , మన శరీరం లోని ప్రతి కణాన్నీ , అను నిత్యం శుభ్ర పరుస్తూ ఉంటాయి ! గమనించ వలసినది , మన దేహం లో ఉన్న ప్రతి కణమూ ,సరిగా పని చేయాలంటే , నిత్యం ఆక్సిజన్ సరఫరా తో పాటుగా ,  వివిధ జీవ రసాయన క్రియల లో ఏర్పడుతుండే వివిధ మాలిన్యాలు కూడా త్వర త్వరగా కణం నుంచి విసర్జన అవుతూ ఉండాలి !   ఆ పనిని కేవలం  వ్యాయామం చేయడం తో పాటుగా ( వ్యాయామం తో రక్త ప్రసరణ సరిగా జరిగి , తద్వారా తగినంత ఆక్సిజన్ అంటే ప్రాణ వాయువు  ప్రతి కణానికీ అందుతుంది )  తాజా గా , సరిగా పనిచేసే  యాంటీ ఆక్సిడెంట్ లు  కూడా అందుతూ ఉండాలి ప్రతి కణానికీ !  ఒకినావా వాసులు ఆపనిని చాలా జాగ్రత్త గా చేస్తున్నారు ! 
3. ఒకినావా పథ్యం లో తక్కువ కొవ్వు , తక్కువ చెక్కెర  ఉంటుంది ! 
4. ఒకినావా వాసులలో, మాంసాహారం తినే వారు కూడా ఉన్నారు. కానీ వారు  ముఖ్యం గా చేపలనూ , మేక మాంసాన్నీ తింటారు. కానీ   వండుకున్నమాంసం పళ్ళెం నిండుగా పెట్టుకుని తినరు. వారు కేవలం మాంసాహారాన్ని స్లైసెస్ , అంటే ఉల్లిపాయ పొరల లాగా, మాంసాన్ని పలుచగా కోసిన ముక్కలనే తింటారు ! గుడ్లూ , ఇతర డెయిరీ ఉత్పత్తులను అంటే జున్ను , వెన్న లాంటి ఉత్పత్తులను చాలా తక్కువ గా తింటారు ! 
5. ఒకినావా పథ్యం లో  ధాన్యాలు , పప్పు దినుసులు , కాయగూరలు ఉంటాయి. చేపల లో పుష్కలం గా ఒమేగా కొవ్వులు , దేహానికి ఎంతో మేలు చేసే కొవ్వులు ఉంటాయి ! ఇంకో ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే ,  మనం సాధారణం గా  తినడానికి , ఎంతో ఏవగించు కునే కాకర కాయల తో చేసిన కూరలూ , సలాడ్ లూ,ఒకినావా వాసుల భోజనాలలో తరచూ ఉండాల్సిందే ట ! (  కాకరకాయ లో ఉండే  జీవ రసాయనాలు , మన శరీరం లో సహజం గా ఉండే ఇన్సులిన్ ను పోలి ఉండడమే కాకుండా , ఇన్సులిన్ లాగానే , మన శరీరం లోని చెక్కెర ను అంటే గ్లూకోజు ను నియంత్రించడానికి ఎంతగానో తోడ్పడతాయి ! ) మరి తాజా పళ్ళూ ,ఆకు కూరల గురించీ,  కాకర కాయల గురించీ , వాటి ఔషధ గుణాల గురించీ , మనకు వేల ఏళ్లకు పూర్వమే ఆయుర్వేద గ్రందాల ద్వారా  తెలిసినా కూడా మనం పట్టించుకోము కదా ! మరి ఈ విషయం లో కూడా , ఇతర దేశాల వ్యామోహం లో పడి , ఒకినావా వాసుల ను అనుకరిద్దామా? ! వందేళ్ళకు పైగా జీవిద్దామా ???!!!
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

20. డయాబెటిస్ లో పథ్యం , పరమార్ధం !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 9, 2013 at 6:40 సా.

20. డయాబెటిస్ లో పథ్యం , పరమార్ధం !

జిహ్వ కోసం సర్వం  తింటే, అనారోగ్యం అనివార్యం !
జీవం కోసం పథ్యం, అనుకుంటే , ఆరోగ్యం తథ్యం !  
 
క్రితం టపాలలో డయాబెటిస్ లో పథ్యం , యొక్క అవసరమూ , పథ్యం  సహజం గానే ఎంత ప్రభావ శీలం గా రక్తం లో షుగరు, అదే గూకోజు ను నియంత్రణ చేస్తుందో తెలుసుకున్నాం కదా ! డయాబెటిస్ కనుక్కున్న తొలి దశలోనే , ” యుద్ధ ప్రాతిపదిక ” మీద కనుక  మందులు లేకుండా ,  కేవలం పథ్యం , యోగం ,వ్యాయామం తో , గ్లూకోజును రక్తం లో సమపాళ్ల లో ఉండేట్టు నియంత్రించుకోవచ్చు ! 
మరి తినే ఆహారం ఎట్లా ఉండాలి : ? మనం కేవలం  ఒక నిర్ణీత సమయం లో ఆహారం తీసుకోక పొతే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం !  
మనం  తినే ఆహారం , ఉదయం  ఫలహారం అంటే బ్రేక్ ఫాస్ట్ చేయడం , మధ్యాహ్నం భోజనం చేయడం , సాయింత్రం వీలుంటే ఏదైనా టిఫిన్ తినడం మళ్ళీ రాత్రి భోజనం చేయడం సామాన్యం గా చేస్తూ ఉంటాం కదా ! చాలామంది, ఉదయం  స్కూళ్ళ కూ , ఆఫీసులకూ పరిగెత్తే సమయం లో ” తీరిక ” లేక , బ్రేక్ ఫాస్ట్ మిస్ అవుతూ ఉంటారు ! ఇది చాలా పొరపాటు ఎందుకంటే , మనకు పగలు పని చేయడం లేదా చదువుకోవడం , రాత్రి నిద్ర పోవడం లేదా ఆలస్యం గా పడుకోవడం లాంటి కార్యక్రమాలు , చేయడం అలవాటే !  ఈ కార్యక్రమాల మధ్యలో వీలున్నప్పుడు తినడం కూడా చేస్తూ ఉంటాము కదా ! కానీ ఇవన్నీ మన దేహానికి తెలియవు ప్రత్యేకించి , మన కడుపు కు  నిరంతరం అంటే ప్రతి నాలుగు నుంచి ఆరు గంటలకు ఒకసారి కడుపులో ” పడ్డ ” ఆహారం అంతా , జీర్నమయి , చిన్న ప్రేగులలోకీ , పెద్ద ప్రేగులలోకీ జారాల్సిందే కదా ! మరి సాయింత్రమో , రాత్రో భోజనం చేసిన తరువాత మళ్ళీ ఉదయం  బ్రేక్ ఫాస్ట్ మిస్ అయి , మళ్ళీ మద్యాహ్నం వరకూ కడుపు ను ఖాళీ గా ( అంటే ఏ  ఘనాహారమూ తినకుండా ) ఉంచితే ,దాని పర్యవసానాలు తీవ్రం గా దేహం మీద ఉంటాయి !  ఇక్కడ జరుగుతున్నది ,  మధ్యాహ్నం భోజనానికీ, సాయింత్రం టిఫిను కూ మధ్య అయిదారు గంటల విరామం , సాయింత్రం టిఫినుకూ , రాత్రి భోజనానికీ మధ్య ఇంకో మూడు నాలుగు గంటల విరామం ఉంటుంది ! కానీ రాత్రి భోజనానికీ , మళ్ళీ ఉదయం బ్రెక్ ఫాస్ట్ మిస్ అవుతే , మధ్యాహ్నం భోజనానికీ , మధ్య విరామం కనీసం పద్నాలుగు నుంచి పదహారు గంటల విరామం !  అంతంత విరామాలు ,జీర్ణ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయి ! 
అందువల్ల పథ్యం ఎప్పుడూ , మన రోజువారీ క్యాలరీ అవసరాల బట్టి , ఉదయం క్యాలరీలు ఎక్కువ గానూ , మధ్యాహ్నం క్యాలరీలు మధ్యస్తం గానూ , రాత్రి క్యాలరీలు నియమితం గానూ తీసుకోవాలి !  రాత్రి నియమితం గా ,ఎందుకు అంటే , నిద్రలో మనకు అవసరమయే క్యాలరీలు అతి తక్కువ గా ఉంటాయి !  కానీ సామాన్యం గా మనం రాత్రి పూట ‘సుష్టు ” గా ” కడుపు నిండా ” లాగించ డానికే  ఉత్సాహ పడుతుంటాము !  కానీ , డయాబెటిస్ లేక పోయినా కూడా, అట్లా రాత్రి పూట కడుపు నిండా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు ! గమనించవలసినది , ఏ సమయాలలో మనం ఎక్కువ గా శారీరిక శ్రమ చేస్తూ ఉంటామో , ఆ సమయానికి నాలుగు గంటల ముందు గా ఆ క్యాలరీల కు సమానమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి ! ( క్రితం టపాలలో వివరించినట్టు , రాత్రి పూట కనుక, కేవలం భోజనం అయాక నిద్ర పోకుండా , చదువుకునే విద్యార్ధులు , లేదా రతి రాత్రులలో దంపతులూ, సహజం గానే ,  తదనుగుణం గా క్యాలరీలకు సమానమైన ( ఎక్కువ ) ఆహారం తీసుకోవచ్చు ! ) 
ముఖ్యం గా డయాబెటిస్ నిర్ధారణ అయిన వారు,  ఎక్కువ సార్లు , అంటే నాలుగైదు సార్లు , తక్కువ పరిమాణం ( క్యాలరీలూ ) ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి !
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

19. డయాబెటిస్ చికిత్సా సూత్రాలు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 7, 2013 at 9:47 సా.

19. డయాబెటిస్ చికిత్సా  సూత్రాలు !

Myth

ఎన్నడూ  మానకు , పథ్యం ,యోగం , వ్యాయామం, 
రెండో దశలో కలుపు, మెట్ ఫార్మిన్ ! 
మూడో దశలో అవసరమేమో, ఇన్సులిన్ !  
ఏకాదశి నాడే  కలగాలి, చెక్కెర పై వ్యామోహం !
ద్వాదశి  నుండి  కొనసాగించు, చికిత్సా దీక్ష , శివోహం ! 
సదా వైద్య సలహా తో  మేలవును, మధుమేహం !  
క్రితం టపాలో చూశాము కదా డయాబెటిస్ యొక్క   చికిత్స మీద  ఉన్న అపోహలూ అపార్ధాలూ !   మరి పైన ఉన్న ‘ పద్యం ”  మళ్ళీ మళ్ళీ చదివితే , చికిత్స  అంటే ఏమిటో గుర్తు ఉంచుకోడానికి వీలుగా  ఉంటుంది ! మొదటి దశ లో అంటే డయాబెటిస్ ను కొత్తగా నిర్ధారించిన వెంటనే , చేయవలసినది ,  పథ్యం , యోగం , వ్యాయామం !
పథ్యం : ఈ పదం చాలా చిన్న గా ఉన్నా ఎంతో అర్ధవంతమైనదీ , అమూల్యమైనదీ  కూడానూ !  ఏ రకమైన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకునే ఆహారమైనా పథ్యం అనబడుతుంది ! అంటే ఏది పడితే అది, ఎంత పడితే అంత తినకుండా , ప్రత్యేకమైన కూరగాయలు కానీ , ధాన్యాలు , చిరుధాన్యాలు కానీ , లేదా వివిధ పానీయాలు కానీ, చాలా ప్రత్యేకం గా , అంటే ఏరి కోరి , తీసుకుని , వాటిని వండడం లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని , వండడమే కాక , పరిమాణం కూడా నియమితం గా తీసుకుంటే దానిని పథ్యం అంటారు ! 
మరి డయాబెటిస్ లో పథ్యం ఎట్లా ఉండాలి ?:  ముందుగా డయాబెటిస్ ఉన్న వారు, వారి రోజువారీ  క్యాలరీలు ఎన్ని వ్యయం చేస్తున్నారో లెక్క కట్టుకోవాలి ! వారికి ఆ విషయం తెలియక పొతే , తెలిసిన వారి సహాయం తీసుకోవాలి ! ఆ తరువాత , రోజులో వ్యయం అయ్యే క్యాలరీలను షుమారుగా మూడో ,నాలుగో భాగాలు గా , అంటే  మూడు నాలుగు సార్లు మనం రోజూ ఆహారం తీసుకుంటాం కాబట్టి , విభజించుకుని , ఒక్కో భాగం లో ఎన్ని క్యాలరీలు ఉంటాయో , ఆ క్యాలరీల కు సరిపడే ఆహారాన్నే తీసుకోవడానికి మానసికం గా సిద్ధ పడాలి !  గమనించ వలసినది ,  వ్యయం కాని క్యాలరీలు, కొవ్వు రూపం లోనో , లేదా షుగరు రూపం లోనో శరీరం లో అదనం గా ఏర్పడుతూ ,  డయాబెటిస్ కంట్రోలు కు అవరోధం అవుతాయి ! 
యోగం : అంటే యోగా చేయడం : ఇది చికిత్స మధ్య లోకి ఎందుకు వచ్చింది , పానకం లో పుడక లాగా ? అని అనుకుంటారేమో !  యోగా చేయడం వల్ల ,మానసిక వత్తిడి తగ్గుతుంది ! మానసిక వత్తిడి తగ్గితే ,  వత్తిడి  అయినప్పుడు మన శరీరం లో ఏర్పడే హానికరమైన , ప్రత్యేకించి రక్తం లో గ్లూకోజు ను పెంచే ఎడ్రినలిన్ లాంటి హార్మోనులు తగ్గుముఖం పడతాయి !  దానితో రక్తం లో చెక్కెర కూడా కొంత వరకు తగ్గుతుంది ! 
ఇక వ్యాయామం :  దీని ప్రాముఖ్యత ప్రత్యేకం గా చెప్పుకోనవసరం లేదు కదా !  వ్యాయామం కొవ్వును కరిగిస్తుంది, క్యాలరీలను కరిగిస్తుంది ! రక్తం లో ఉన్న గ్లుకోజును  కండరాలలోకి ప్రవేశ పెట్టి , తద్వారా , రక్తం లో గ్లూకోజు ను తగ్గిస్తుంది ! ముఖ్యం గా గమనించ వలసినది ఏమిటంటే , ఈ పథ్యం , యోగం , వ్యాయామం , డయాబెటిస్ నిర్ధారణ అయినప్పటి నుంచీ , జీవితాంతం కొనసాగిస్తూ ఉండాలి ! మందులు , లేదా ఇన్సులిన్ తీసుకోవాల్సి వచ్చినా కూడా ! ఎందుకంటే  పై మూడు పద్ధతులు కూడా , సహజం గానే  గ్లూకోజును తగ్గించే పద్ధతులే కదా ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

18. ఇక డయాబెటిస్ చికిత్స సూత్రాలేంటి ?

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., మానసికం, Our Health on మే 6, 2013 at 9:50 ఉద.

18. ఇక  డయాబెటిస్ చికిత్స సూత్రాలేంటి ?

గత టపాలలో,  వయసు వచ్చిన తరువాత అంటే టైప్ టూ  డయాబెటిస్ , కంట్రోలు లో లేకుండా ఉంటే శరీరం లో కలిగే దుష్పరిణామాలు ఏమిటో , అవి ఎట్లా వస్తాయో కూడా వివరం గా తెలుసుకోవడం జరిగింది కదా ! ఇప్పుడు  డయాబెటిస్ వచ్చినపుడు మొదలుపెట్టే చికిత్సా పద్ధతుల గురించీ , సామాన్యం గా చికిత్సలో జరిగే పొరపాట్ల గురించీ తెలుసుకుందాం ! అవసరమైన పరీక్షలు చేయించు కోవడం వల్ల , డయాబెటిస్ నిర్ధారణ అయిన వారి మనస్తత్వం ఇట్లా ఉంటుంది :
1. ” నేను ఇప్పటి వరకూ ఆరోగ్యం గానే ఉన్నాను కదా ! నాకు డయాబెటిస్ రావడం ఏమిటి ? పరీక్షలలో ఏదో పొర పాటు జరిగి ఉంటుంది ” అనుకునే భావన ! ఇట్లా అనుకునే వారు , శాస్త్రీయం గా పరీక్షలు చేసి ,నిర్ధారణ చేసిన , వారి డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేసి , తమకు తెలియకుండానే వ్యాధిని తీవ్రతరం చేసుకుంటారు ! అంతేకాక, మానసికం గా, వారు  డయాబెటిస్ వ్యాధి గ్రస్తులనే యదార్ధాన్ని ఆమోదించే స్థితిలో ఉండరు !  ఈ సమయం లో వారికి కావలసింది, డయాబెటిస్ గురించి కూలంక షం గా తెలియచేసే వారు , వారు వారి మిత్రులైనా , బంధువులైనా , లేదా ముఖ్యం గా వారి డాక్టర్ అయినా పరవాలేదు ! కావలసినది వారి సందేహాలన్నీ నివృత్తి చేసి , చికిత్స యొక్క ప్రాముఖ్యత ను తెలియ జేయటమే !
2.”  నాకు ట్యాబ్లెట్లు వేసుకునే అలవాటు ఎప్పుడూ లేదు నా జీవితం లో , ఇప్పుడు ఈ వెధవ  ట్యాబ్లెట్లు  అన్నీ వేసుకుని , నా శరీరాన్ని మందుల మయం చేసుకోను ” అనుకునే ఉద్దేశం !ఇట్లా అనుకోవడం కూడా పొరపాటే ! ఎందుకంటే , చీటికీ మాటికీ ట్యాబ్లెట్లు వేసుకోవడం ఎవరికీ మంచిది కాదు, ఎవరికీ ఇష్టం ఉండకూడదు కూడానూ ! కానీ ఒక వ్యాధి నిర్ధారణ అయినప్పుడు , ఆ వ్యాధిలో, ఆ ట్యా బ్లెట్  చక్కగా పని చేస్తున్నట్టు , అనేక వందల పరిశీలనల ద్వారా స్పష్టమయినప్పుడు కూడా , అశ్రద్ధ చేసి , అనుమాన ధోరణి తో మందులు వేసుకోకుండా ఉండడం , కేవలం వారి వ్యాధిని తీవ్రతరం చేసుకోడానికే !
3.”  కాస్త తీపి పదార్ధాలు తినకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది , అప్పుడప్పుడూ అయితే పరవాలేదు ” అనుకుని తమకు తామే కన్సెషన్ లు ఇచ్చుకుందామనే  ” ఉదార ” బుద్ధి ” ఈ రకం గా ఎవరికి వారు , కన్సెషన్ లు ఇచ్చుకుంటూ వారి రోజు వారీ పథ్యం విషయాలలో రిలాక్స్ అవుతూ ఉంటే కూడా వ్యాధి కంట్రోలు లో ఉండదు ! 
4. ” డాక్టర్లు  అందరికీ చెబుతుంటారు , సిగరెట్లు తాగ కూడదనీ , మద్యం ముట్ట కూడదనీ , ఇట్లా అనేకం చెబుతూ ఉంటారు, వారు చెప్పే మాటలను ఖాతరు చేయనవసరం లేదు ఎందుకంటే , మద్యానికీ , సిగరెట్లు తాగడానికీ , మధుమేహానికీ సంబంధం ఏమిటి ? ” అనుకుంటూ , కనీసం ఆ సంబంధం ఏమిటో  తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా , వైద్య సలహాను హాస్యాస్పదం చేస్తూ ఉంటారు !  తీవ్రమైన అనారోగ్యానికి లోనవుతూ ,వారు క్షోభ పడుతూ , వారి కుటుంబాలకు కూడా ఎంతో ఖేదం కలిగిస్తారు , కేవలం వారి అశ్రద్ధా , నిర్లక్ష్యం వల్ల !  
పైన ఉదహరించిన ఆలోచనా ధోరణులు ఉన్న వారందరికీ ఒకటే సూచన !  డయాబెటిస్ రోగ నిర్ధారణ అయిన వెంటనే , వారు, వారి రక్తం లో షుగరు కంట్రోలు కు అవసరమయే సర్వ ప్రయత్నాలూ ప్రారంభించాలి, ఆ ప్రయత్నాలను కొనసాగించాలి , వారి జీవితాంతం !  ఒక విధం గా , వారికై  వారు , రక్తం లో అధిక షుగరు మీద యుద్ధం ప్రకటించడమే ! ఆ యుద్ధం , వారి జీవితాంతం కొనసాగించాల్సిందే !  యుద్ధం ఒక్క రోజు ఆపినా కూడా , శత్రువు ( అధిక షుగరు ) ది పై చేయి అవుతుంది,శరీరానికి కలగ కూడని అపాయం జరుగుతుంది ! 
వచ్చే టపాలో  చికిత్సా సూత్రాలు ఏమిటో వివరం గా తెలుసుకుందాం ! 

17. డయాబెటిస్ లో, కాళ్ళ జాగ్రత్తలు :

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 5, 2013 at 1:04 సా.

17. డయాబెటిస్ లో కాళ్ళ జాగ్రత్తలు :

 
డయాబెటిస్ లో  పాదాల సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి. దీనికి కారణం, డయాబెటిస్ చాలా కాలం కంట్రోలు లో లేక పోవడం వల్ల వచ్చే పరిణామాలతో  దెబ్బ తిన్న  నాడులు అంటే నెర్వ్. ప్రత్యేకించి పాదాలలో ఉండే నాడులు. మనం తెలుగులో సాధారణం గా నాడి చూసి మందు ఇస్తాడు డాక్టరు అని అంటాము ! ఆ నాడి ,యదార్ధానికి నాడి కాదు అంటే నెర్వ్ ( nerve ) కాదు. అది రేడియల్ ఆర్టరీ ( radial artery ) అంటే మన చేతిలోకి గుండె నుండి రక్తం సరఫరా చేసే ఒక ధమని ! ఇప్పుడు మనం నాడులు అని చెప్పుకునేది నెర్వ్ ల గురించి. ఈ నాడులు మన మెదడు నుంచి ప్రారంభం అవుతాయి. మన శరీరం లో ప్రతి భాగానికీ విస్తరించి ఉంటాయి. ఇట్లాంటి నాడులలో, కాలిలో ఉన్న నాడి  సరిగా పని చేయక పొతే , పాదాలలో స్పర్శ తెలియకుండా పోతుంది. పర్యవసానం గా కాలికి దెబ్బ తగిలినా కూడా ఎక్కువ నొప్పి కలగక పోవడం , వేడి , శీతలం లాంటి స్పర్శలు తక్కువ అవడం కూడా జరుగుతుంది ! ఈ పరిస్థితిని ‘ న్యూరొపతీ ‘ అంటారు. 
పాదాలలో చర్మం లో మార్పులు: స్పర్శ జ్ఞానం తక్కువ అవుతూ ఉండడం వల్ల , పాదం లో చర్మం ఎండి పోయినట్టు అవుతుంది అంటే డ్రై నెస్. అందువల్ల పాదాలకు ప్రత్యేకమైన ఆయింట్ మెంట్స్ పూసుకుంటూ ఉండాలి. కానీ పాదాలను ఈ ఆయింట్ మెంట్స్ తో నింప కూడదు , కారిపోయేట్టు !
పాదాల లో కాలస్ లు ఏర్పడడం :  పాదాలలో తరచూ కొంత భాగం ( ప్రత్యేకించి వత్తిడి ఎక్కువ గా ఉన్న భాగాలు ) లో చర్మం దళసరి గా అయి కొంత కాలం తరువాత, చిన్న చిన్న కంతులు లేదా బుడిపెలు గా ఏర్పడుతాయి. ఇవి స్పెషలిస్టు తో తోలిగించుకోక పొతే , పుళ్ళు గా మారుతాయి, అంటే అల్సర్ లు గా ! ఈ పుళ్ళు ఒక పట్టాన మానవు ! దానివల్ల , కోతి పుండు  బ్రంహ రాక్షసి ” అన్న చందాన ఆ పుళ్ళు సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఉంది ! చాలా మంది డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు , వ్యాధి కంట్రోలు లో లేక పోవడం వలననే ,పాదాలకు పుళ్ళు ఏర్పడినా , ” దానంతట అదే తగ్గుతుంది లే ” అనుకుని అశ్రద్ధ చేస్తూ ఉంటారు ! చాలా కేసులలో వారు వారి పాదానికి ఉన్న వేళ్ళు , పాదాలూ , ఇంకా పరిస్థితి విషమించితే , కాళ్ళూ కోల్పోయిన సందర్భాలు అనేకం ! 
పాదాలలో అల్సర్ లు,  కాలస్ లు నివారించాలంటే ఏమి చేయాలి ?: 
క్యాలస్ లు ఏర్పడితే వాటిని తోలి దశలలోనే  ఒక ప్రత్యేకమైన రాయి ( గరుకు గా ఉంటుంది ) ఆ ప్రదేశాలను ” ఆరగ తీస్తూ ” ఉండాలి !   పుళ్ళు లేదా అల్సర్ లు ఏర్పడిన తోలి దశలలొనే , వైద్యుడితో సంప్రదించి , తగిన సలహా తీసుకోవాలి !  కేవలం యాంటీ బయాటిక్స్ తీసుకోవడమే కాకుండా , రక్త పరీక్ష చేయించుకుని ,రక్తం లో షుగరు కంట్రోలు లో ఉందో లేదో నిర్ధారించుకోవాలి. అది కూడా కేవలం పరీక్ష రోజున కాకుండా పరీక్ష కు పూర్వం రెండు మూడు నెలలు, రక్తం లో షుగరు ఏమాత్రం కంట్రోలు లో ఉందో  తెలిపే పరీక్ష చేయించుకోవాలి ! అల్సర్ లు ఏర్పడినప్పుడు  ఆ అల్సర్ల మీద బరువు పడేట్టు నడవడం కూడదు. అట్లాంటి పరిస్థితి ఏర్పడితే ,నడక మాని , పుళ్ళు మానే వరకూ విశ్రాంతి తీసుకోవాలి !  పాద రక్షలు సరియైన సైజు ఉన్నవే ఎపుడూ ధరిస్తూ ఉండాలి !  బూట్లు ధరించడం ఉత్తమం కానీ ,అవి చాలా బిగుతు గా ఉండ కూడదు. అంతే కాక  శుభ్రమైన నూలు సాక్స్ ను ప్రతి రోజూ వేసుకోవాలి , కేవలం బూట్లు మాత్రమె వేసుకోవడం మంచిది కాదు , ప్రత్యేకించి డయాబెటిస్ ఉన్న వారు ! ఎందుకంటే , చెమట వల్ల కాళ్ళలో పుళ్ళు ఏర్పడే రిస్కు ఎక్కువ గా ఉంటుంది ! బూట్లు చిన్న చిన్న గాయాలనుంచి పాదాలను రక్షిస్తాయి కూడా ! డయాబెటిస్ ఉన్న వారు, స్మోకింగ్ చేయకూడదు. ఎందుకంటే , వారి పరిస్థితి ” గోడ దెబ్బ , చెంప దెబ్బ ” అన్న విధం గా ఉంటుంది అంటే , డయాబెటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ తో ,  స్మోకింగ్ వల్ల కలిగే కాంప్లికేషన్స్ తోడై ,  రక్త నాళా లనూ, నాడులనూ త్వరితం గా దెబ్బ తీస్తాయి ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

16. డయాబెటిస్ లో , కిడ్నీస్ జాగ్రత్త లు !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 4, 2013 at 10:04 ఉద.

16. డయాబెటిస్ లో , కిడ్నీస్ జాగ్రత్త లు !

 
డయాబెటిస్ లో మూత్ర పిండాల వ్యాధి ఎవరికి ఎక్కువ గా వచ్చే రిస్కు ఉంటుంది ? 
బ్లడ్ షుగరూ , బ్లడ్ ప్రష రూ ! :  అంటే, డయాబెటిస్ వ్యాధిలో మూత్ర పిండాల వ్యాధి కి మూల కారణం,  రక్తం లో కంట్రోలు లో లేక అధికం గా ఉన్న షుగరూ ,ఇంకా  కంట్రోలు లో లేక అధికం గా ఉన్న రక్త పీడనమూ ! ఈ రెండూ కలిసి  మూత్ర పిండాల వ్యాధి కి దొహదమవుతాయి ! కొంత వరకూ వంశ పారంపర్యం గా వచ్చే మూత్ర పిండాల వ్యాధులు కూడా వాటికి తోడవుతే , కిడ్నీ వ్యాధి ఇంకా త్వరగా వచ్చే రిస్కు ఉంటుంది !
మరి తోలి దశలలో మూత్ర పిండాల వ్యాధిని ఎట్లా గుర్తించ వచ్చు ?:
మన దేహం లో అనేక అవయవాలు, మనకోసం ” త్యాగం ” చేస్తూ ఉంటాయి ! తమ శక్తి యుక్తులు, మన జీవితాంతం , మన కోసం ధార పోస్తూ ఉంటాయి ! అందుకే చాలా అవయవాలు తాము చెడి పోతూ ఉన్నప్పటికీ , వెంటనే తెలియచేయవు !  ఉదాహరణకు : మన కాలేయం తీసుకోండి ! దానినే లివర్ అనికూడా అంటారు కదా ! మానవులు అతిగా తాగే మద్యం తోనూ , ఇంకా సిగరెట్ స్మోకింగ్ తోనూ  లివర్ చాలా అవస్థ పడుతూ కూడా మన నిత్య జీవితానికి అవసరమయే అన్ని క్రియలనూ నిర్వర్తిస్తూ ఉంటుంది ! అంటే లివర్ నాలుగు భాగాలు చెడి పోయినా కూడా పని చేసే ఐదో భాగం తో  మన శరీరం లో తన క్రియలు నిర్వర్తించుతూ ఉంటుంది !అందుకే , విపరీతం గా మద్యం తాగే వారికి ఏమాత్రమూ లివర్ చెడిపోతున్న సూచనలు కనబడవు , మిగతా ఐదో భాగం కూడా చెడి పోయే దాకా ! అదే విధం గా ,కిడ్నీ కూడా చెడిపోతున్న జల్లెడలు అవే నెఫ్రాన్ లు ఎక్కువ అవుతున్నా కూడా ” తన పని , తాను చేసుకుంటూ పోతుంది , అందువల్ల చాలా భాగం కిడ్నీ చెడి పొతే కానీ మనకు ఆ సూచనలు తెలియవు ! ఒక మాదిరి గా కిడ్నీ పని చేయనప్పుడు , కడుపు లో వికారం , ఆకలి లేక పోవడమూ, బలహీనతా , ఏపని లో ఏకాగ్రత లేక పోవడమూ లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ! గమనించ వలసినది , ఈ లక్షణాలు మిగతా జబ్బులలో కూడా కనిపిస్తాయి కదా ! అంటే ఇవి కేవలం కిడ్నీ సరిగా పని చేయ నప్పుడే కనపడవు కదా ! అందువల్ల అప్రమత్తత తో తగిన స్పెషలిస్టు ను సంప్రదించి , అవసరమైన పరీక్ష లు చేయించు కోవాలి ! 
మరి డయాబెటిస్ లో కిడ్నీ జబ్బును నివారించ గలమా ?:
అనేక పరిశోధనల వల్ల  స్పష్టమైనది ఏమిటంటే ,  ఖచ్చితమైన షుగరు కంట్రోలు తో , మూత్ర పిండాలను ” బ్రంహాండం గా పని చేసేట్టు ” చూసుకోవచ్చు  అని ! అంటే , మిగతా అవయవాల లాగానే , మూత్ర పిండాలు కూడా ఖచ్చితమైన బ్లడ్ షుగర్ కంట్రోలు ఉంటే , చక్కగా పని చేస్తూ ఉంటాయి అని !వైద్య నిపుణులు సూచించిన మందులు కూడా క్రమం తప్పకుండా వేసుకుంటూ ఉండాలి ! ప్రత్యేకించి , రక్త పీడనం కంట్రోలు కు ఇచ్చిన మందులు ! కొందరు నిపుణులు , ప్రోటీను, అంటే మాంస కృత్తులు రోజూ మనం తినే ఆహారం లో తక్కువ గా ఉంటే కూడా కిడ్నీస్ చాలా కాలం పాటు సరిగా పని చేస్తాయని అభిప్రాయ పడతారు ! 
రెండు కిడ్నీలూ ” చేతులెత్తేస్తే ”, మానవుల గతి ఏమిటి ?: 
వైద్య శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందింది  చాలా !  కిడ్నీ లు రెండూ చాలా వరకూ చెడిపోయినా కూడా డయాలసిస్ అనే ప్రక్రియతో ” చెడి పోయిన రక్తాన్ని శుద్ధి చేసి మళ్ళీ శరీరం లో, శుభ్ర పరిచిన రక్తాన్ని ప్రవేశ పెడతారు ! అంటే  డయాలసిస్ యంత్రం మన కిడ్నీ లాగా పని చేస్తుందన్న మాట ! ఇక కిడ్నీలు రెండూ వంద శాతం చెడి పొతే , అప్పుడు  కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అంటే చెడిపోయిన కిడ్నీ ని తొలగించి , ఆరోగ్య వంతమైన కిడ్నీ ని దాతల దగ్గర నుంచి తీసుకుని , శరీరం లో పెడతారు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు ! 

 

15. డయాబెటీసూ, కిడ్నీసూ, కాంప్లికేషన్సూ !

In ప్ర.జ.లు., మన ఆరోగ్యం., Our Health on మే 3, 2013 at 10:29 సా.

15. డయాబె టీసూ,   కిడ్నీసూ, కాంప్లికేషన్సూ ! 

పైన ఉన్న చిత్రం , మన మూత్ర పిండాలలో ఉండే  అనేక లక్షల అతి సూక్ష్మ ” జల్లెడ ” లలో ఒకటి.  దీనిని శాస్త్రీయం గా  ”నెఫ్రాను ”  అని  పిలుస్తారు. ( ఒక్కో కిడ్నీ లో ఈ నెఫ్రాను లు , లేదా ” జల్లెడలు ” ఎనిమిది నుంచి పదిహేను లక్షల సంఖ్య లో ఉంటాయి !  ).

 
డయాబెటిస్ ,అంటే  మధుమేహం లో కిడ్నీస్ లో వచ్చే కాంప్లికేషన్ లు ఏమిటి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ! 
కంట్రోలు లో లేని డయాబెటిస్, దేహం లో అన్ని భాగాలకూ హాని చేస్తుంది, క్రమేణా ! మరి మూత్రపిండాలకు ఎందుకు కన్సెషన్ ఇస్తుంది , ఆ ఎక్కువైన షుగరు ?!!!కిడ్నీ పరీక్షలు, ఒక క్రమ పధ్ధతి లో చేయించుకుంటూ ఉండడం అందువల్ల నే ఉత్తమం !
ముఖ్యం గా డయాబెటిస్ ఉన్న వారూ , కొత్తగా గుర్తించ బడిన వారూ  గుర్తు ఉంచుకోవలసినది:  మూత్ర పిండాలు , అంటే కిడ్నీలు తొలిదశలో డయాబెటిస్ వల్ల చూపించే మార్పులు ,  సరిఅయిన సమయం లో కనుక గుర్తించి , తగిన జాగ్రత్తలు తీసుకునేట్టయితే ,  ఆ మార్పులు  అక్కడే ఆగి , కిడ్నీ ఫెయిల్యూర్  నివారింప బడుతుంది ! తొలిదశలో ఏకారణం చేతనైనా ఆ మార్పులను గుర్తించక పొతే, లేదా గుర్తించిన మార్పులను అశ్రద్ధ చేస్తే , కిడ్నీ ఫెయిల్యూర్ కు దారి తీస్తుంది ! కిడ్నీ ఫెయిల్యూర్ అంటే , కిడ్నీస్,  ” ఇక మావల్ల కాదు మానవా  ” అని  ” చేతులెత్తేయడమే” !
డయాబెటిస్ లో కిడ్నీ చెడి పోయే రిస్కు ఎట్లా ఎక్కువ అవుతుంది ? :
మనకందరికీ తెలుసు కిడ్నీసు  మన రక్తాన్ని శుద్ధి చేస్తాయని. ఎట్లాగంటే , మూత్రపిండాలలో ఉండే నిర్మాణాలు మన దేహం లో ఉండే అతి సున్నితమైనా , అతి సూక్ష్మ మైనా జల్లెడ ల లాగా పని చేసి , రక్తంలో , మన దేహానికి అవసరమయే పదార్ధాలను రక్తం లోనే ఉంచి , అనవసరమైనా లేదా హానికరమైన పదార్ధాలను మూత్రం ద్వారా బయటికి పంపుతాయి ! దీనినే మూత్ర విసర్జన అని అంటాము. మన రక్తం లో షుగరు ఎక్కువ అయినప్పుడు , మన కిడ్నీస్ ఎక్కువ గా అంటే కష్టపడి పనిచేసి ,రక్తాన్ని శుద్ధి చేయడం జరుగుతుంది ! విపరీతం గా ఈ క్రియలో కష్ట పడుతున్నమూత్రపిండాల లోని జల్లెడలు కొన్ని చోట్ల ” చిన్న చిన్న చిల్లులు ” పడిన విధం గా తయారవుతాయి !  దానితో , మన దేహానికి ఉపయోగకరమైన పదార్ధాలు కూడా దేహం లోకి పోకుండా , ఈ ” చిల్లులు పడ్డ జల్లెడల ” ద్వారా మూత్రం లో బయటకు వస్తాయి ! కిడ్నీస్ లో ఈ చిల్లులు పెద్దవీ , ఎక్కువ సంఖ్య లో ఏర్పడుతున్న కొద్దీ , ఎక్కువ ఉపయోగ కర పదార్ధాలు బయటకు విసర్జింప బడడం జరుగుతూ ఉంటుంది !దానితో మూత్రపిండాలు చెడి పోవడమే కాకుండా , మనిషి కూడా బలహీన పడడం జరుగుతుంది ! 
అంతే కాకుండా , కాల క్రమేణా , ఈ జల్లెడలు సరిగా పని చేయక పోవడం ఎక్కువ అవుతూ , దేహానికి ఉపయోగం లేని , హాని కర పదార్ధాలు, మూత్రం ద్వారా బయటకు వెళ్ళ కుండా , దేహం లోనే ఉండడం వల్ల , అంటే మన రక్తం లోనే ఉండి పోతూ ఉండడం వల్ల , ఆ విష పూరిత పదార్ధాలు చేసే హాని మన శరీరం లోనూ కనిపిస్తూ ఉంటుంది ! ఉదాహరణ కు : యూరియా , క్రియాటినిన్ , లాంటి పదార్ధాలు ! ఇవి రక్తం లో ఎంత ఎక్కువ గా ఉంటే  అంత రక్తాన్ని కలుషితం చేస్తాయి !  రక్తం మన దేహం లో ప్రవహించని ప్రదేశం ఏదీ లేదు కదా ! దాని వల్ల మన మెదడు కూడా సరిగా పని చేయలేక పోవచ్చు ! 
వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !