ఇదో రకం మోసం ! 3. పిరమిడ్ స్కీములు, లెక్కలు రాని వారికి పిరమిడ్ కడతాయి !
‘ ఏదైనా స్కీము లో, చేరే వారే , ఇంకా కొందరిని చేర్పించాలి ‘ అని చెప్పే స్కీము వివరాలు తెలుసుకోగానే , వారి దగ్గర నుంచి శెలవు తీసుకోవడం మంచిది ! ఎందుకో ఇప్పుడు చూద్దాం !
పైన ఉన్న చిత్రం చూడండి ! శ్రద్ధతో గమనించితే , పిరమిడ్ ఆకారం లో ఉన్న ఆ చిత్రం లో శిఖరాన ఉన్న వాడు ( కొంపలు కూల్చే వాడు ) ఒక స్కీములో ఓ అర డజను మంది ని చేర్చాడని అనుకుంటే , ఆ చేరిన ఆరుగురూ , తలా ఇంకో ఆరుగురిని చేర్పించాలని నిబంధన పెడతాడు ! ‘ అట్లా చేర్పించితేనే వారికి కమీషన్ ఉంటుందని ‘ ఆశ పెడతాడు ! అంటే మొదటి ఆరుగురు ఉదాహరణకు , తలా వంద రూపాయలు కట్టి స్కీములో చేరితే , ఆ ఆరువందలూ , శిఖరాన ఉన్న వాడు తీసుకుంటాడు ! మరి ఆ ఆరుగురికీ లాభం రావాలంటే , ‘ ఒక్కొ క్కరూ మళ్ళీ ఇంకో ఆరుగురిని చేర్చితేనే ‘ అని చెబుతాడు ! ఆ ఆరుగురూ , ఇంకో ముప్పై ఆరుగురిని చేర్చ గలిగితేనే , వారికి లాభం ఉంటుంది ! ఇట్లా , ఆ ముప్పై ఆరుగురూ , తాము కట్టిన డబ్బుకు మళ్ళీ లాభం పొందాలంటే , వాళ్ళు తలా ఆరుగురిని ( అంటే 216 మందిని ) స్కీము లో చేర్పించితేనే వారికి లాభం వచ్చేది ! ఇట్లా గుణింపు చేసుకుంటూ వెళితే , అట్టడుగున ఉన్న వారి సంఖ్య ఈ భూమి మీద ఉన్న జనాభా సంఖ్య ను మించితే గానీ , వారి పైనున్న వారికి , లాభం రాదు ! అట్లాంటి పరిస్థితి లో పిరమిడ్ లో అడుగు భాగాన ఉన్న వారు, లాభం ఏమీ పొంద కుండా , ఆ పిరమిడ్ క్రింద భూస్థాపితం అయి పోవాల్సిందే , ఆర్ధికం గా ! పిరమిడ్ స్కీములో అందరూ లాభ పడడం అనేది అసాధ్యం. ఇంపాజిబుల్ ! ఈ వాస్తవం, శాస్త్రీయం గా నిరూపించ బడింది కూడా ! ( పిరమిడ్ స్కీము లో చేరిన వారిలో, వందకు 88 మంది నుంచి 99. 88 మంది వారి డబ్బు ను కోల్పోతారని శాస్త్రీయం గా నిరూపించ బడింది ! ) ప్రపంచం లో నేపాల్ దేశం తో సహా అనేక దేశాలలో నిషేధించ బడిన ఈ పిరమిడ్ స్కీములు , భారత దేశం లో ‘ అవసరమైన వారి అండ దండలతో ‘ యధేచ్చ గా నడుస్తూ ఉన్నాయి , పేదల కష్టార్జితం తో వారి మీదే పిరమిడ్ లు కట్టి , జీవితం లో కోలుకోలేకుండా చేయడానికి ! తస్మాత్ జాగ్రత్త !
వచ్చే టపాలో ఇంకో రకం మోసం గురించి !
ఈ స్కీము లోగుట్టును చక్కగా వివరించారు. ‘లెక్కలు రాని వారికి పిరమిడ్ కడతాయి’ అనే వ్యాఖ్య చాలా బాగుంది!
కృతఙ్ఞతలు వేణు గారూ ! ఇట్లాగే, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపుతూ ఉంటారని ఆశిస్తున్నా !