చదువుకోవడం ఎట్లా ? 26. పరీక్షలయ్యాక కర్తవ్యం ఏమిటి ? (2)
పాఠ్య పుస్తకాలను పదిల పరుచుకోవడం : సామాన్యం గా , పరీక్షలు అయిపోగానే , ఒక పెద్ద భారం తల మీద నుంచి దిగినట్టు , ‘ ఎంతో కష్ట పెట్టిన ‘ పాఠ్య పుస్తకాలను , త్వరగా భౌతికం గా వదిలించు కునే ప్రయత్నం చేస్తారు ! అంటే , ఎవరికైనా ఇవ్వడమో , లేదా సెకండ్ హాండ్ షాప్ లో అమ్మడమో !
కానీ మూల సూత్రాలన్నీ , ఉండి , మీరు అండర్ లైన్ చేసుకోవడమూ , లేదా మీకు పాఠ్య పుస్తకాలలోనే నోట్స్ రాసుకునే అలవాటు ఉంటే , అట్లా రాసుకున్న పాఠ్య పుస్తకాలు , మీరు చదివినదే మళ్ళీ మళ్ళీ చదవడానికి ఎంతో ఉపకరిస్తుంది ! విద్యార్ధులు గమనించ వలసినది , ప్రతి తరగతి లోనూ ఉన్న సిలబస్ ఆ పై తరగతి లో ఉపయోగ పడుతుంది ! అంటే భౌతికం గా ప్రతి పాఠ్య పుస్తకమూ , వేరు గా ఉన్నా కూడా , ఆ వివిధ పాఠ్య పుస్తకాలలో ఉన్న పాఠాలూ , విషయాలూ , ఒక క్రమ పద్ధతిలో గొలుసు లో వలయాల లాగా సంధించ బడి ఉంటాయి ! ఇట్లా సంధించ బడిన విషయాలను , ఒక క్రమ పద్ధతిలో నేర్చుకునే విద్యార్ధులు , తమ మెదడు లో కూడా , అదే పధ్ధతి లో అమర్చు కుంటే , ప్రతి సబ్జెక్టూ కూడా , చాలా సులువవుతుంది నేర్చుకోవడానికీ , రివైజ్ చేయడానికీ కూడా ! రివైజ్ చేయడం అవసరం అయితే , ఇంకో , ఇంకో పుస్తకం లో చూడడం కాకుండా , మనం చదివి అర్ధం చేసుకున్న పాఠ్య పుస్తకం లోనుండే మళ్ళీ చదువుకుంటే , ఎంతో సులభం అవుతుంది ! అంతే కాక , ఒక్కో సారి , ఆ పాత పుస్తకాలలో , పాఠాలు చదివే సమయం లో మంచి అనుభూతులు కూడా గుర్తు కు వస్తూ ఉంటాయి ! ఆ టీచర్ ఇట్లా చెప్పే వాడనో , లేదా ఆ టీచర్ అట్లా బోధించేదనో ! కేవలం అసలు వాటి అవసరమే లేదనుకునే పరిస్థితి లోనే , పాఠ్య పుస్తకాలను వదిలించు కోవడం చేస్తే మంచిది ! కొంత వరకూ ఆర్ధిక కారణాల వల్ల కూడా , ఒక తరగతి లో చదివిన పుస్తకాలను , మార్చి , లేదా అమ్మి , ఇంకో తరగతి పుస్తకాలను కొనడం జరుగుతుంది కూడా ! అది తప్పని సరి పరిస్థితి కానీ , స్థోమత ఉన్న వారు , పాఠ్య పుస్తకాలను వారి వ్యక్తి గత గ్రంధాలయం లో పదిల పరుచు కుంటేనే ఉత్తమం !
రాసిన నోట్సు ను పదిల పరుచుకోవడం : పాఠ్య పుస్తకాల విషయం ఏం చేసినా కూడా , నోట్సు ను మాత్రం , తప్పనిసరిగా పదిల పరచుకుంటే ఉపయోగాలు చాలా ఉంటాయి ! ఎందుకంటే , పాఠ్య పుస్తకాలు చదివి , అర్ధం చేసుకున్న విషయాలను సంగ్రహం గా నోట్సు లో మీరే రాసుకోవడం జరుగుతుంది కాబట్టి , మీకు అవసరమైనప్పుడల్లా ,ఆ నోట్సు లో చదివి , ఆయా పాఠ్యాం శాలను రివైజ్ చేసుకోవచ్చు !
కంప్యూటర్ మీద చేసిన మీ వర్క్ ను కూడా : జాగ్రత్తగా ఒక సీడీ రూపం లోనో , లేదా పెన్ డ్రైవ్ లలోనో లేబెల్ చేసి,(పేరూ , తారీఖూ చెరగని ఇంకు తో రాసి) పదిల పరుచుకోవడం ఉత్తమం ! కంప్యూటర్ లో స్పేస్ కూడా ఏర్పడుతుంది !
పాసయినా , ఫెయిలయినా, లక్ష్యం, ముందుకు పోవడమే అవ్వాలి !
పరీక్షలు ఎంతో ముఖ్యమైన మైలు రాళ్ళు , జీవిత పధం లో ! ఆ మైలు రాళ్ళను నడిచే వారూ దాట గలరు , పరిగెత్తే వారూ దాట గలరు , వాహనం మీద వెళ్ళే వారూ దాట గలరు ! పాసయిన వారూ దాట గలరు , ఫెయిల్ అయిన వారూ దాట గలరు ! వారు అనుకున్న , నిర్ణయించు కున్న లక్ష్యాలను చేరుకోగలరు ! చరిత్ర పుటల్లో , చదువు తో సంబంధం లేకుండా కూడా , జీవితం లో ఎంతో ముందుకు పోయిన వారూ , ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వారూ, కోకొల్లలు ! ఫలితాలతో నిమిత్తం లేకుండా , కేవలం, జీవితం విలువను గ్రహిస్తూ, ఆ జీవితం లో విజయం సాధించాలనే కృత నిశ్చయం తో నో , ఆశావాదం తోనూ కృషి చేసిన వారే విజయులయ్యారు ! అనేక పరిస్థితుల వల్ల , అనేక లక్షల మంది , చదవ లేక పోవచ్చు , లేదా చదివి ఉత్తీర్ణులు కాలేక పోవచ్చు. అది నేరం కాదు ! అది కేవలం కొన్ని అవకాశాలను కోల్పోవడం మాత్రమే ! ఆశావాదం తోనూ , సాధనతోనూ , శోధన చేసే వారికి , ప్రపంచమంతా అవకాశాలు ఎన్నో ఉంటాయి ! విద్యార్జన , ఒక ఉత్తమ మానవుడిగా తయారు చేస్తే , ఆ విద్య సార్ధకమయినట్టే కదా ! కాగితాల మీద ఫలితం ఏ విధం గా ఉన్నా కూడా !

వచ్చే టపాలో ఇంకొన్ని సంగతులు !
you are giving good information
Thank you Amarnath !
Please tell your friends too , so that they too can benefit . After all , this is a free site !
Best wishes.